హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రభుత్వ రంగ బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 1,623-2,962 శ్రేణిలో ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి ఎల్ఐసీ తాజాగా సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్లో ఎంత ధరలో ఐపీవో జారీ అయ్యేదీ వెల్లడించలేదని సమాచారం. ఈ అంశంపై ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల అంచనాలు కొనసాగుతున్నాయి. ఎల్ఐసీ ఎంబడెడ్ విలువ 2021 సెప్టెంబర్ 30నాటికి రూ. 5.39 లక్షల కోట్లుగా ఉంటుందని, దీనికి 2-3.5 రెట్లు విలువను బీమా కంపెనీలకు అపాదిస్తారని, ఈ ప్రకారం ఎల్ఐసీ విలువ రూ. 10.7 లక్షల కోట్ల నుంచి రూ.18.7 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా. సంస్థ మొత్తం ఈక్విటీ 632 షేర్లు కాగా, ఇందులో 5 శాతం వాటాను విక్రయించి రూ. 53,500-93.625 కోట్ల మధ్య ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఒక్కో షేరును కనిష్ఠంగా రూ. 1,693, గరిష్ఠంగా రూ.2,962 ధరతో పబ్లిక్ ఇన్వెస్టర్లకు జారీచేయవచ్చని మార్కెట్లో విశ్లేషణలు కొనసాగుతున్నాయి.