తుర్కయాంజాల్, డిసెంబర్ 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలలో త్రాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.164 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, కౌన్సిలర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో రూ.38 కోట్లతో ఇప్పటికే వాటర్ పైపులైన్లు, వాటర్ ట్యాంక్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. మంజూరైన నిధులతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో రూ.92 కోట్లతో 218 కిలో మీటర్ల మేర వాటర్ పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంక్(ఓహెచ్ఆర్)ల నిర్మాణం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో రూ.54 కోట్లతో 140 కిలో మీటర్ల వాటర్ పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాక్(ఓహెచ్ఆర్)ల నిర్మాణం, ఆదిబట్లలో రూ.18 కోట్లతో 36 కిలో మీటర్ల వాటర్ పైపులైన్లు, ట్యాంక్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు.
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారం సీఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్స్, పెద్దఅంబర్పేటలో 4.00 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ల నిర్మాణం చేపడుతారన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధికి అడగగానే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఈ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాగన్నగూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5.19 కోట్లు విడుదలయ్యాయన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ అవుట్లెట్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇదివరకే ఇస్తానన్న రూ.3 కోట్లతో పాటు మరో రూ.3 కోట్లు అదనంగా ఇవ్వాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. నాదర్గుల్ నుం చి వచ్చే డ్రైనేజీని చెరువులోకి రాకుండా సంబంధిత అధికారులతో మాట్లాడుతానని, మురుగు నీరు శుద్ధి కోసం ఎస్టీపీ నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం వివిధ సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీజీఎం అమరేందర్, జీఎం శ్రీధర్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు కల్యాణ్ నాయక్, ఐలయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం : ఆపత్కాలంలోనూ పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కొంగర మల్లమ్మ రూ.34 వేలు, రాయపోల్ గ్రామానికి చెందిన నల్ల భాస్కర్గౌడ్కు రూ.60 వేలు, నాంపల్లి కృష్ణకు రూ.42 వేల సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, చర్లపటేల్గూడ మాజీ సర్పంచ్ కాల్లె గణేశ్, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు హరిప్రసాద్గౌడ్, బాలుగౌడ్, నాయకులు మహేందర్, నవీన్, పర్వతాలు, హరిబాబు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
క్రైస్తవుల సంక్షేమానికి కృషి
యాచారం : క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో ఐసీపీసీ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సెమీక్రిస్మస్ వేడుకలను మంగళవారం నిర్వహించారు. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు క్రీస్తు జీవిత చరిత్రను తమ సందేశం ద్వారా వివరించారు. చిన్నారులు కేక్ కట్చేసి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, వెంకటమరణారెడ్డి, తలారి మల్లేశ్, పాస్టర్లు క్రిస్టిఫర్, బాబు, సామ్యూల్ తదితరులు పాలొగన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన బట్టు ముత్తయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కిషన్రెడ్డి అందజేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ తదితరులున్నారు.