న్యూఢిల్లీ, మార్చి 23: భారతదేశంలో మానవ ఆరోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్నవాటిలో వాయు కాలుష్యం రెండో స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు-2022 వెల్లడించింది. గాలి కాలుష్యం కారణంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతో దేశంపై ప్రతీ ఏటా రూ.11 లక్షల కోట్ల భారం పడుతున్నదని పేర్కొన్నది. ఇండియాలో పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 స్థాయిలు కరోనా ముందు స్థాయికి పెరిగినట్టు తెలిపింది. వాహనాలు, విద్యుదుత్పత్తి, పారిశ్రామిక వ్యర్థాలు, నిర్మాణ రంగం, పంట ఉత్పత్తులను కాల్చివేయడం ఇండియాలో ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నట్టు పేర్కొన్నది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టును ప్రతీ ఏటా విడుదల చేస్తుంది.