అమరావతి : అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా ఆరోపించారు. ఇవాళ ఆమె నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు నచ్చదని విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా 420 పనులేనని అన్నారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని నిమ్మకూరు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. బాలకృష్ణను చూస్తే జాలేస్తుందని అన్నారు. చంద్రబాబు రాసే స్క్రిప్ట్ చదవడం మానేసి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా బయటకు రావాలని సూచించారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు భయపడ్డారని ,అందుకే ఆయనను పార్టీ నుంచి దూరం పెట్టారని విమర్శించారు. జగన్ను తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారని తెలిపారు. మహానాడులో తిట్టపురాణం తప్ప మరేమిలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని ఎద్దేవ చేశారు. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోనసీమలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్య అని పేర్కొన్నారు. అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు.