న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించిన బోర్డు.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చింది. 16 మందితో కూడిన జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్కు అవకాశం దక్కగా.. హైదరాబాద్ రంజీ కెప్టెన్ హనుమ విహారికి మొండిచేయి చూపెట్టిన సెలెక్టర్లు.. అతడిని దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టుకు ఎంపిక చేశారు. ‘రెండో టెస్టులో విరాట్ జట్టును ముందుకు నడిపిస్తాడు’అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చాన్నాళ్ల తర్వాత టెస్టు పిలుపు రాగా.. సిరీస్ స్వదేశంలో జరుగనుండటంతో అదనపు
ఆఫ్ స్పిన్నర్గా జయంత్ యాదవ్ను ఎంపిక చేశారు. తాజా జట్టులో రాహుల్, మయాం క్, గిల్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లు ఉండగా.. సీనియర్లు రహానే, పుజారా
మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. పంత్ గైర్హాజరీలో సాహా వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టడం ఖాయం కాగా… అతడికి బ్యాకప్గా శ్రీకర్ భరత్కు అవకాశమిచ్చారు. స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాతో పాటు అదనంగా అక్షర్, జయంత్కు జట్టులో చోటు దక్కింది. బుమ్రా, షమీకి విశ్రాంతినివ్వడంతో పేస్ దళానికి ఇషాంత్ నాయకత్వం వహించనుడంగా. ఉమేశ్, హైదరాబాదీ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అతడికి సహకరించనున్నారు.
టీమ్ఇండియా తరఫున ఆడిన చివరి మ్యాచ్లో తన వీరోచిత పోరాటంతో అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న మిడిలార్డర్ బ్యాటర్ హనుమ విహారికి న్యూజిలాండ్తో జట్టులో చోటు దక్కకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్ గడ్డపై కష్టకాలంలో క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ను కాపాడిన విహారికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో కంగారూల ఇలాఖాలో టీమ్ఇండియా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకోవడంలో విహారి కీలక పాత్ర పోషించిన విషయం విధితమే. కఠినమైన విదేశీ పిచ్లపై నాణ్యమైన బౌలింగ్ దాడిని ఎదుర్కోవడంలో నిష్ణాతుడైన విహారిని.. సయ్యద్ ముస్తాక్ అలీ 20 టోర్నీలో సత్తాచాటలేదనే కారణంగా పక్కన పెట్టడం మరింత విడ్డూరంగా కనిపిస్తున్నది. ‘విహారిని భారత్-ఎ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పంపుతున్నాం. అక్కడ ‘ఎ’-టెస్టు సిరీస్లో అతడి ప్రదర్శనను పర్యవేక్షిస్తాం’అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. గతంలో అతడి ప్రదర్శనను పరగణించకుండా.. తాజా ఫామ్ ప్రకారమే విహారిని విస్మరించినట్లు మరో అధికారి తెలిపారు. కాగా.. మిడిలార్డర్లో రహానే, పుజారా రూపంలో ఇద్దరు నెమ్మదైన ఆటగాళ్లు ఉండగా.. విహారికి బదులు దూకుడుగా ఆడే ప్లేయర్ ఉండాలనే ఉద్దేశంతోనే అతడిని తప్పించి శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతున్నది.
జట్టు: రహానే (కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, గిల్, శ్రేయస్, సాహా, భరత్, జడేజా, అశ్విన్, అక్షర్, జయంత్, ఇషాంత్, ఉమేశ్, సిరాజ్, ప్రసిద్ధ్.