ఐపీఎల్లో మరే సారథికి సాధ్యం కాని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ తాజా సీజన్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు! అటు ఆటగాడిగా.. ఇటు నాయకుడిగా విఫల మవుతూ అభిమానులను నిరాశలో ముంచెత్తుతున్నాడు!! మరి మొన్నటి వరకు పరుగుల వరద పారించిన హిట్మ్యాన్కు తాజా సీజన్లో ఏమైందనే ప్రశ్నకు.. మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా కెప్టెన్సీ వల్ల రోహిత్పై అదనపు భారం పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి! ఈ భారం తనకొద్దనే ఉద్దేశంతోనే సీజన్ ప్రారంభానికి ముందే విరాట్ సారథ్య బాధ్యతలకు టాటా చెప్పగా.. మయాంక్ అగర్వాల్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు! నిరుడు పంజాబ్ ఓపెనర్గా నిలకడ కొనసాగించిన మయాంక్ ఈసారి నాయకత్వ బాధ్యతలతో జట్టుకే భారంగా మారాడు!!
ఇక చెన్నై సారథ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! లీగ్ ఆరంభానికి రెండు రోజుల ముందు మహేంద్రసింగ్ ధోనీ జట్టు పగ్గాలు రవీంద్ర జడేజాకు అప్పగించగా.. అతడు ఏమాత్రం ప్రభావం చూపలేక తిరిగి మహీకే కెప్టెన్సీ కట్టబెట్టాడు. ఇటీవలి కాలంలో ఆల్రౌండర్గా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జడ్డూ.. సారథి హోదాలో అటు బాల్తో, ఇటు బ్యాట్తో కనీస ప్రదర్శన చేయలేక చతికిలబడ్డాడు. తొలి రెండు మ్యాచ్ల్లో వెన్నంటి నిలిచిన మహీ.. ఆ తర్వాత జడ్డూ నిర్ణయాలను ఫాలో కాగా.. ఢిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై ఘోరంగా విఫలమైంది. ఎటొచ్చి అప్పటి వరకు ఎలాంటి బాదరాబందీ లేకుండా ఆడిన ప్లేయర్లకు కెప్టెన్సీ భారమవుతుందని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సారథులపై
‘ఒక్కసారి జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత చాలా బాధ్యతలు వచ్చి మీద పడతాయి. టాస్క్లు పెరిగేకొద్ది.. అవి మన మనసును ప్రభావితం చూపుతాయి. ఈ అదనపు భారం వల్లే రవీంద్ర జడేజా సన్నద్ధత, ప్రదర్శనలో వెనుకబడ్డాడని భావిస్తున్నా’ హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్న మాటలివి. అంతర్జాతీయ స్థాయిలో దశాబ్దంన్నర కాలం సారథిగా వ్యవహరించిన మహీ నోటి నుంచి వచ్చిన మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
గతంలో ఆటగాడిగా అద్భుత విజయాలు సాధించిన ఆటగాళ్లు కూడా.. ఒక్క సారి బాధ్యతలు మీద పడేసరికి కనీస ప్రదర్శన చేయలేకపోయిన సందర్భాలు కోకొల్లలు. అందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉదంతమే సరైన ఉదాహరణ. ప్లేయర్గా పరుగులు వరద పారిస్తున్న సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న మాస్టర్.. కెప్టెన్గా తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు.
తాజా ఐపీఎల్ను గమనిస్తే రోహిత్పై కూడా ఈ ప్రభావం పడుతుందనే అనిపిస్తున్నది. ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపిన హిట్మ్యాన్.. ఈ సీజన్కు ముందే మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. ఆ భారం వల్లే తాజా సీజన్లో అతడి ప్రదర్శన నాసిరకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లీగ్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యా ఇటీవల మాట్లాడుతూ.. ‘సీజన్ ముగిసేలోపు నా జుట్టు మొత్తం రాలిపోతుందేమో. ఒత్తిడిని నియంత్రించడం అంత సాధారణ విషయం కాదు’ అని అన్నాడు.
ఈ సీజన్కు ముందు వరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఆల్రౌండర్గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్.. ఈసారి కెప్టెన్ అవతారమెత్తడంతో అతడికి తత్వం బోధపడినట్లుంది. అయితే మైదానంలో తోటి ఆటగాళ్లతో సరదాగా ఉండే హార్దిక్.. జట్టును మాత్రం సరైన దిశలోనే నడిపిస్తున్నాడు.
ముంబై జట్టులో రోహిత్ను దగ్గర నుంచి గమనించిన హార్దిక్.. అతడిలాగే ముందుకు సాగుతున్నాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ‘ముంబై సారథిగా రోహిత్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో అతడిలో ఎలాంటి జోష్ ఉండేదో.. హార్దిక్లోనూ అదే కనిపిస్తున్నది. అతడు గుజరాత్ టైటాన్స్ను చాలా బాగా నడుపుతున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా చివరి వరకు క్రీజులో నిల్చుని జట్టును గెలపించాలనే కసి అతడి ఆటలో కనిపిస్తున్నది’ అని సన్నీ అన్నాడు.