Road accident : కడప జిల్లా చెన్నూరు మండల శివార్లలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు శివారులో అతివేగంతో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఇతర సాంకేతిక కారణాలవల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.