డాలర్ దెబ్బకు రూపాయి లేవలేకపోతున్నది. కరెన్సీ మార్కెట్లో బలపడేందుకు ఆపసోపాలు పడుతున్న భారతీయ కరెన్సీ అంతకంతకూ బలహీనపడుతున్నది. తాజాగా ఆల్టైం కనిష్ఠానికి దిగజారింది. డాలర్కు పెరుగుతున్న డిమాండ్, దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులు రూపాయి ఉసురు తీస్తున్నాయి.
ముంబై, మే 9: రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా క్షీణించింది. డాలర్తో పోల్చితే సోమవారం ఫారెక్స్ మార్కెట్లో ఆల్టైం కనిష్ఠానికి పడిపోయింది. గత ముగింపు కంటే 54 పైసలు దిగజారి 77.44 వద్ద స్థిరపడింది. ఈ స్థాయిని రూపాయి విలువ తాకడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా డాలర్తో పోల్చితే రూపాయికి కనిష్ఠ విలువగా ఈ ఏడాది మార్చిలో నమోదైన 77.05 ఉన్నది. ఇప్పుడు ఆ రికార్డు కనుమరుగైపోయినైట్టెంది. నిజానికి ఉదయం ట్రేడింగ్ ఆరంభమైన దగ్గర్నుంచే రూపాయి బలహీనపడుతూ వస్తున్నది. సమయం గడుస్తున్నకొద్దీ విలువ ఇంకా దిగజారింది. ఈ క్రమంలోనే ఒకానొక దశలో 77.52 స్థాయినీ చేరింది. ఇక శుక్రవారం కూడా 55 పైసలు కోల్పోగా.. ఈ రెండు రోజుల్లో 109 పైసలు పడిపోవడం గమనార్హం.
డాలర్కు పెరుగుతున్న డిమాండ్, దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులు రూపాయి ఉసురు తీస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రూపాయి మారకం విలువ త్వరలోనే 80కి పడిపోవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి మరో 5,517.08 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ పరిణామం కూడా రూపాయిని దెబ్బతీస్తున్నది. ఫారెక్స్ ట్రేడర్లు ద్రవ్యోల్బణ హెచ్చరికలూ చేస్తున్నారు. అయితే రూపాయి స్థిరత్వానికి రిజర్వ్ బ్యాంక్ మార్కెట్లోకి డాలర్లను విడుదల చేయవచ్చు. కానీ ఇప్పటికే ఈ ఏడాదిలో ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు తొలిసారిగా 600 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోవడం ఒకింత ఆందోళనకర అంశం.
రూపాయి పతనం.. సామాన్యుడికి శరాఘాతమే. దిగుమతులపై ఆధారపడి తయారయ్యే ప్రతీ వస్తూత్పత్తి విలువ పెరుగుతుంది మరి. దీంతో అందరి బడ్జెట్ తలకిందులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెచ్చుమీరితే.. దాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతాయని, దీంతో రుణాలు ప్రియమై.. ఈఎంఐలు భారమైపోతాయని అంటున్నారు. ఈ పరిస్థితులు ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ గూడ్స్కు ఇబ్బందేనని వ్యాఖ్యానిస్తున్నారు.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణిస్తున్నకొద్దీ.. పెట్రో ధరలు పైపైకి వెళ్లనున్నాయి. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా విదేశీ ముడి చమురు దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాలర్ల ట్రేడింగ్లో మరిన్ని రూపాయిలు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే జరిగితే ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పరుగందుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది.