సూర్యాపేట, ఫిబ్రవరి 27 : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైందని, మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పరిపాలన చేస్తోందని దుయ్యబట్టారు. తిరుమలగిరిలో మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు స్వీకరణ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. రైతులకు రైతు బంధు వేయకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుండి డబ్బులు పంపాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.
భారతదేశంలోనే ఎక్కువ పంటను పండించి రికార్డు సృష్టించిన జిల్లా నల్లగొండ అన్నారు. పదేళ్లలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు చేయకుండా దళారులను, దోపిడిదారులకు కొమ్ముకాస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు డబ్బులను ఎగ్గాడుతూ దేవుళ్ల మీద ఒట్లు పెట్టి పబ్బం గడుపుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులకు స్వర్ణయుగం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోస పడుతున్నరని, యూరియా, కరెంట్, నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.