నిర్మల్ : సామాన్యులు కూడా ఉన్నత విద్యావంతులు అయ్యేలా విద్యారంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సెయింట్ థామస్ హైస్కూల్ లో నిర్వహించిన అభినంధన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేసి వారిని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివి కార్పొరేట్కు దీటుగా మార్కులు సాధించడంపై ప్రశంసల కురిపించారు.
ప్రభుత్వకళాశాల్లో నాణ్య మైన అందుతుందనడానికి ఇదే చక్కటి నిదర్శనమన్నారు. ఉమ్మడి పాలనలో ఆదిలాబాద్ జిల్లా విద్యా రంగంలో చాలా వెనుకబడి ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో చదువుకు పేదరికం అడ్డురాకూడదని, హక్కుగా చదువుకోవాలనే వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించామంటే ఇది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. రానున్న రోజుల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మరింత కష్ట పడి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముశ్రప్ అలీ ఫారూఖీ , డీఈవో రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.