నాగర్కర్నూల్, మార్చి 23 (నమస్తే తెలంగాణ)/శ్రీశైలం : వేసవిలో తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రాకు అత్యధికంగా నీటిని తోడుకున్నారు. విద్యుదుత్పత్తి కోసం కూడా ఏపీ శ్రీశైలంలో నుంచి నిర్దేశించి న నీటి వాడకంతో అధికంగా విడుదల చేసింది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం కేవలం 31 టీఎంసీల నీళ్లు మాత్ర మే రిజర్వాయర్లో నిల్వ ఉన్నాయి. ఈ కారణంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ని ర్మించిన ఎంజీకేఎల్ఐ ద్వారా మిషన్ భగీరథ పథకానికి నీళ్లు అందడం కష్టంగా మారింది. వేసవిలో తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి విడుదల చేసిన నీటిని బుధవారం సాయంత్రం రివర్స్ పంపింగ్ చేపట్టారు. ఇలా మూడు టీఎంసీలను తాగునీటి అవసరాలు తీర్చేందుకు మళ్లించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా 706 ఆవాసాలకు తాగునీరు అందనున్నది. దాదాపు వారం రోజులపాటు రివర్స్ పంపింగ్ ద్వారా నీటి తోడివేత ప్రక్రియ జరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సలహాదారులు పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు నీటి మళ్లింపు ప్రక్రియను చేపట్టారు. వారం పాటు అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ వద్దే మకాం వేసి తాగునీటికి ఢోకా లేకుండా చర్యలు తీసుకోనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పీహెచ్-2 పంప్ మోడ్ ద్వారా నీటి తరలింపు ప్రారంభమైంది. విద్యుత్సౌద డైరెక్టర్ వెంకటరాజం, జలసౌధ (ఈఎన్సీ) ఉన్నతాధికారి పెంటారెడ్డి బృందం ఆధ్వర్యంలో స్విచ్ ఆన్ చేశారు. సాగర్ బ్యాక్వాటర్ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు యూనిట్-1 టర్బైన్ ద్వారా రో జుకు 0.5 టీఎంసీలు పంపింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ జెన్కో డైరెక్టర్ వెంకటారాజం, ఈఎం సీఈ కృపాకర్రెడ్డి, మిషన్ భగీరథ సీఈ చెన్నారెడ్డి, ఎస్ఈ వెంకటరమణ ఉన్నారు.