ఎల్లారెడ్డి, జూలై 28: చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అసలేం జరిగిందంటే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని రాంపూర్ వెనుక తండాకు చెందిన దేవసత్ బాలు, చాందీరాం, దూప్యా గురువారం ఉదయం స్థానిక పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. వీరు వెళ్లిన తర్వాత రెండు గంటలపాటు ఎగువన భారీ వర్షం పడటంతో వాగులోకి వరద ఉధృతి పెరిగింది. ప్రాణభయంతో వాగులోని చెట్టుపైకి చేరి హాహాకారాలు చేశారు. గమనించిన తండావాసులు 100కు ఫోన్చేశారు.
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసు, సీఐ శ్రీనివాస్, నలుగురు ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో మాట్లాడారు. అప్పటికప్పుడు సీఎస్ సోమేశ్కుమార్తో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని కోరడంతో రాజధాని నుంచి ఆ బృందం సైతం లింగంపేటకు బయలు దేరింది. అప్పటికే ఎల్లారెడ్డి నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి తాడు సహాయంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. అవసరమైతే హెలికాప్టర్ పంపాల్సి ఉంటుందని అధికారులు పేర్కొనడంతో మంత్రి వేముల అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వర్షం నిలిచిపోవడం.. మధ్యాహ్నం నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు హెలికాప్టర్ అవసరం లేదని పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వాగులో వరద ఉధృతి తగ్గడంతో తండా వైపు నుంచి ఓ గిరిజనుడు ధైర్యంగా వచ్చి ఆ ముగ్గురిని జాగ్రత్తగా తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.