ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకొనేందుకు ఆస్కారం చాలా తక్కువని తెలిసి కూడా కేసులు దాఖలుచేయడం వల్ల ప్రజాప్రయోజనం ఏముంటుంది? నిజంగా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పిటిషన్లు వేయాలి. ప్రాజెక్టులు ప్రజలకు మేలు చేకూర్చుతాయన్న విషయాన్ని మరిచి పోకూడదు. ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని గుర్తుంచుకోవాలి.
-హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగంగా తీసుకొనే చర్యలను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసే విధానాన్ని బుధవారం హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుల విషయంలోనూ వ్యాజ్యాలు ఎలా వేస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. రోడ్లు వేస్తామంటే కూడా రిట్లు వేస్తారా? అని వ్యాఖ్యానించింది. కేసు వేసేందుకు ప్రజాహితం ఉండాలని హితవు చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపైన, సాంకేతిక అంశాలపైన పదేపదే కేసులు వేసే విధానం సరికాదని పేర్కొన్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ప్రజలకు, రైతులకు నీళ్లు వస్తుంటే చిన్నచిన్న టెక్నికల్ అంశాలపై రిట్లు వేయడం ఎంతవరకు సబబో చెప్పాలని కోరింది. ఇటీవల దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు పైవిధంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు మేలు జరిగేలా.. ప్రజాహితం కోరేలా పిల్స్ ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ టీ తుకారాంజీల ధర్మాసనం బుధవారం నొక్కి చెప్పింది.
అవగాహన లేకుండానే రిట్లు
కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్చేస్తూ దాఖలైన రెండు వ్యాజ్యాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించబోయే రిజర్వాయర్ కోసం భూసేకరణ, భూ పరిహారం కోసం వేర్వేరుగా దాఖలైన వ్యాజ్యాలు ఇటీవల విచారణకు వచ్చాయి. ప్రజల కోసమే ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతాయని, సాంకేతిక కోణంలో నిపుణులు పరిశీలించి, అవసరమైతే వాటిని రీడిజైన్ చేస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రాజెక్టుల నిర్మాణం అనేది ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగమవుతుందని, విధాన నిర్ణయాలపై అదేపనిగా కేసులు వేయడం సముచితంకాదని చెప్పింది. రీడిజైనింగ్ అనేది సాంకేతిక అంశమని, వీటిపై అవగాహన లేకుండా రిట్లు దాఖలు చేయడమేమిటని ప్రశ్నించింది. ప్రజలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుల విషయంలోనూ కేసులు వేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం ఎంతవరకూ సబబో చెప్పాలని పిటిషనర్లను నిలదీసింది.
ప్రాజెక్టులు ప్రజలకు మేలుచేస్తాయి
కాళేశ్వరం రీడిజైనింగ్ను సవాల్ చేస్తూ భానోతు ఈశ్వర్సింగ్, కొండం చెరువు కోసం ఏ బాలయ్య, నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కిడికి గ్రామానికి చెందిన రైతు, ఇతరులు దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలన్నింటినీ కలిపి వచ్చే మంగళవారం విచారణ చేస్తామని ప్రకటించింది. ఈ కేసులన్నీ వేర్వేరు రోజుల్లో విచారణకు వచ్చినప్పడు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అయినదానికి కానిదానికి కేసులు వేస్తే ఎలాగని అసహనాన్ని వ్యక్తంచేసింది. కేసు వేస్తే దాని వెనక ప్రజాహితం ఉండాలని చెప్పింది. సాంకేతిక విషయాలపై పిటిషనర్లకు కనీస అవగాహన కూడా లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకొనేందుకు ఆస్కారం చాలా తక్కువని తెలిసి కూడా కేసులు దాఖలుచేయడం వల్ల ప్రజాప్రయోజనం ఏముంటుందో చెప్పాలని నిలదీసింది. నిజంగా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పిటిషన్లు వేయాలని సూచన చేసింది. ప్రాజెక్టులు ప్రజలకు మేలు చేకూర్చుతాయన్న విషయాన్ని మరిచి పోకూడదని వ్యాఖ్యానించింది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని గుర్తుంచుకోవాలని హితవు పలికింది. ఏవైనా ప్రజా వ్యతిరేకంగా ఉంటే కోర్టులు కూడా వెంటనే స్పందిస్తాయని తేల్చి చెప్పింది. అన్ని కోణాల్లోనూ లోతుగా పరిశీలించి ఆ వ్యాజ్యాలన్నింటిపై జనవరి 4న విచారణ చేస్తామని వెల్లడించింది.