రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారు. ఇక్కడ ధాన్యాన్ని ఆరబోసేందుకు టార్పాలిన్ కవర్లు తప్పనిసరిగా కావాలి. అయితే, ధాన్యం పరిమితికి మించి వస్తుండడంతో దొరక్క రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవసరాన్ని తమ ఉపాధిగా చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన పలువురు చిరు వ్యాపారులు. అవసరమున్న వారికి అద్దెకిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒక్క రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు కిరాయి తీసుకుంటున్నారు. కాగా, అద్దె భారం పడినా వర్షాలు పడినప్పుడు పంటను కాపాడుకోవడానికి కవర్లను కిరాయికి తీసుకోక తప్పడం లేదని రైతులు అంటున్నారు.
ధాన్యం ఆరబోసేందుకు ఉపయోగించే టార్పాలిన్ల (పరదాలు)కు డిమాండ్ పెరుగుతున్నది. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే, కొనుగోలు కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం వస్తుండడంతో వాటిని ఆరబోసేందుకు అవసరమైన టార్పాలీన్ కవర్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పలువురు చిరు వ్యాపారులు టార్పాలిన్లను అద్దెకిస్తూ ఉపాధి పొందుతున్నారు.
వరి కోతలు జోరు…
ఈ వానకాలంలో మెదక్ జిల్లాలో భారీగా వరి సాగైంది. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవడానికి టార్పాలిన్ల అవసరం ఎక్కువ. కోతలు మొదలవగానే రైతులు ముందుగా వెతికేది టార్పాలిన్ల కోసమే. దీన్ని వ్యాపారంగా మలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన చిరు వ్యాపారులు టార్పాలిన్లను రైతులకు అద్దెకిస్తూ ఉపాధి పొందుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఒక్కో కుటుంబం సుమారు 600 నుంచి 2000 వరకు టార్పాలిన్లను తీసుకువచ్చి అద్దెకు ఇస్తున్నారు. ఒకవేళ రైతులు ఖాళీ బస్తాలు తీసుకువస్తే టార్పాలిన్లు కుట్టిస్తున్నారు. కాగా, ఒక్కో టార్పాలీన్కు రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు అద్దె చెల్లిస్తూ రైతులు ధాన్యాన్ని రక్షించుకుంటున్నారు.
తగినన్ని టార్పాలిన్లు లేక ఇబ్బందులు…
వ్యవసాయ శాఖ, సొసైటీ శాఖలో సబ్సిడీ టార్పాలిన్లు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో, రైతులు అధికంగా చెలిస్తూ టార్పాలిన్లను అద్దెకు తీసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనా లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం ఎక్కువ రోజులు ఆరబెట్టాల్సి వస్తోంది. దీంతో అద్దె భారం ఎక్కువవుతున్నది.
టార్పాలిన్లకు డిమాండ్..
చిలిపిచెడ్ మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం ఆరబోయడానికి టార్పాలిన్లు తప్పనిసరిగా కావాలి. రోజుకు ఒక్క టార్పాలీన్కు రూ.10 నుంచి రూ.15 వరకు చెలిస్తున్నాం. సొసైటీ, వ్యవసాయ అధికారులు సబ్సిడీ టార్పాలిన్లు అందుబాటులో లేవంటున్నారు.
అద్దెకిస్తూ ఉపాధి..
ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుంచి వచ్చి చిలిపిచెడ్ మండలం చండూర్లో 600 టార్పాలిన్లు రైతులకు అద్దెకిస్తూ ఉపాధి పొందుతున్నాం. ఒక్కో టార్పాలీన్ను రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు అద్దెకు ఇస్తున్నాం. వచ్చే ఆదాయంతో మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సీజన్లో రూ.లక్ష వరకు కిరాయిలు వస్తున్నాయి.
అద్దెకిస్తూ.. ఖాళీ బస్తాలు కుట్టిస్తూ..
టార్పాలిన్లు అద్దెకిస్తూ.. రైతుల దగ్గర ఖాళీ బస్తాలను కుట్టిస్తూ ఉపాధి పొందుతున్నాం. గుంటూరు జిల్లా నుంచి వచ్చి 1000 టార్పాలిన్లు అద్దెకిస్తు న్నా. ఖాళీ సమయంలో రైతులు ఎరువులు చల్లిన ఖాళీ బస్తాలను కుట్టిస్తున్నా. ఖాళీ బస్తా ఒక్కో దానికి రూ.8 నుంచి రూ.10 వరకు డబ్బులు తీసుకొని టార్పాలిన్లు కుట్టిస్తున్నా. ప్రతి సీజన్లో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు కిరాయిలు వస్తున్నాయి.