ఖైరతాబాద్, జూన్ 6: నిమ్స్ దవాఖాన వైద్యులు మరో అద్భుత ఘనత సాధించారు. అత్యంత క్లిష్టమైన నూర్యోసర్జరీని ఆధునిక పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. కంటి గవ్వ మార్గం ద్వారా మెదడులోని కణితిని పూర్తిగా తొలగించి వైద్యరంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరపేట మండలం మధుర్ గ్రామానికి చెందిన మంగలి లత (50) తీవ్రమైన తలనొప్పితో నిమ్స్ను ఆశ్రయించారు. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించడంతో కంటి వెనుకభాగాన పుర్రె అడుగు ప్రాంతంలోని మెదడులో కణితి ఉన్నట్టు తేలింది.
సాధారణంగా ఇలాంటి కణతుల తొలగింపునకు తల ఎముకను తెరిచి క్రానియోటమీ శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, లతకు స్వల్ప గాయంతో చికిత్స అందించాలన్న లక్ష్యంతో నిమ్స్ వైద్య బృందం ఆధునిక ఎండోస్కోపిక్ ట్రాన్స్ ఆర్బిటల్ అప్రోచ్ విధానాన్ని ఎంచుకున్నది.
ఎంతో అరుదైన విధానంలో భాగంగా నిమ్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ వై వంశీకృష్ణ నేతృత్వంలో డాక్టర్ యర్రగుంట తిరుమల్, డాక్టర్ రామ్నాథ్రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ఉమామహేశ్వర్ బృందం అత్యాధునిక 3డీ న్యూరోనావిగేషన్ వ్యవస్థతోపాటు కావిట్రాన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్ సాంతికేతికను వినియోగించి ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. కనుబొమ్మ మడత వద్ద చిన్న కోత చేయడం ద్వారా హైడెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో మిల్లీమీటర్ స్థాయి కచ్చితత్వంతో కణితిని పూర్తిగా తీసేశారు.
ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద నిమ్స్లో పూర్తి ఉచితంగా నిర్వహించినట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు. లతకు అRemoval రుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అభినందించారు.