మద్రాస్ హైకోర్టు
చెన్నై, నవంబర్ 25: ఒక మతం నుంచి మరో మతానికి మారినప్పటికీ ఆ వ్యక్తి కులం మారదని, కాబట్టి మతం మారడాన్ని ఆధారంగా చేసుకొని కులాంతర వివాహ సర్టిఫికెట్ జారీ చేయకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు సాలెం క్యాంప్ ప్రాంతానికి చెందిన ఎస్ పాల్ రాజ్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ను తోసిపుచ్చింది. సాలెం జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, తనకు కులాంతర వివాహ సర్టిఫికెట్ ఇప్పించాలని పాల్ రాజ్ తన పిటిషన్లో కోరాడు. ఆది-ద్రావిడ కులానికి చెందిన అతను క్రైస్తవంలోకి మారగా బీసీగా సర్టిఫికెట్ జారీ అయింది. అతను హిందూ అరుంధతియార్ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకొన్నాడు. ఆమెకు ఎస్సీగా కుల ధ్రువీకరణపత్రం జారీ అయింది. క్రిస్టియన్ ఆది-ద్రావిడ కూడా షెడ్యూల్డ్ కులమే అయినందున కులాంతర వివాహ సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.