మెదక్, నవంబర్ 24 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సాధారణ పరిశీలకుడిగా సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్యను నియమించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, సహాయ ఎన్నికల అధికారి రమేశ్, పార్టీ అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థ్ధి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి టి.నిర్మల, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బోయిన విజయలక్ష్మి, సాయిబాబా చింతల, మట్ట మల్లారెడ్డి నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్కుమార్, ఐరేని సత్యనారాయణగౌడ్ నామినేషన్ పత్రాలు ఎన్నికల నియమావళి మేరకు సరిగా లేనందున తిరస్కరించామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 10న పోలింగ్ జరగనున్నది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖాజీపల్లి ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్
జిన్నారం, నవంబర్ 24: ఖాజీపల్లి గ్రామ శివారులోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమి చుట్టూ రెవెన్యూ అధికారులు బుధవారం ఫెన్సింగ్ పనులు చేపట్టారు. 181 ప్రభుత్వ భూమిలో ‘కోట్ల విలువైన భూములు కబ్జా’ శీర్షిక ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’ లో ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ దశరథ్ స్పందించారు. వెంటనే ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు చేసిన 13 మందిపై బొల్లారం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కబ్జాలకు ప్రయత్నించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు పూర్తయిన తర్వాత భూమి చుట్టూ వేస్తామని తహసీల్దార్ తెలిపారు.