బూర్గంపహాడ్, జూలై 08 : బూర్గంపహాడ్ మండలంలోని మీ సేవా కేంద్రాల్లో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక, నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మీ సేవా కేంద్రాల్లో ప్రజలు ధృవపత్రాలు, ఇతర పనుల నిమిత్తం వస్తుంటారని, వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా అధికంగా రుసుము వసూలు చేస్తే అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మీ సేవా కేంద్రాలకు నిర్ణయించిన పనివేళలను తప్పనిసరిగా పాటించాలని, దరఖాస్తుదారుల నుంచి అవసరంలేని భౌతికపత్రాలు మండల రెవెన్యూ కార్యాలయాలు కోరవద్దన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రశీదుల విధానం సమర్ధవంతంగా అమలు చేయాలని, కాగితపు రశీదులకు బదులు దరఖాస్తుదారుల మొబైల్కు రశీదు సందేశం పంపించి, అవసరమైతే ఈ-ప్రింట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మీసేవాలను ఆశ్రయిస్తారని వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, డీటీ సమ్మయ్య, ఆస్ఐలు వీర్రాజు, నర్సింహారావు, మీసేవా కేంద్రం నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.