EPFO : ఈపీఎఫ్వో ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వడ్డీ చెల్లింపు ప్రారంభమైంది. ఈపీఎఫ్ లబ్ధిదారులకు 8.25 శాతం వడ్డీని సంస్థ చెల్లిస్తోంది. ఈ పాటికే కొందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అయింది. దశలవారీగా ఈ వడ్డీ చెల్లింపు జరుగుతున్నట్లు ఈపీఎఫ్వో సంస్థ తెలిపింది. దాదాపు 8 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ వడ్డీ జమకానుంది. ఖాతాదారులకు దీనికి సంబంధించిన జమ అయిన నగదును తమ ఖాతాల్లో చూసుకోవచ్చు. అయితే, అందరికీ జమ కావడానికి కాస్త సమయం పడుతుందని సంస్థ తెలిపింది.
వార్షిక వడ్డీ 8.25 శాతం చెల్లించాలని సంస్త.. ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ. ఒకవేళ ఎవరి ఖాతాలో అయినా వడ్డీ జమకాకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, దశలవారీగా వడ్డీ జమ అవుతుందని వివరించింది. వడ్డీ జమ అయిన తర్వాత తమ కార్పస్లో పెరిగిన నగదును చూసుకోవచ్చు. ఖాతాదారులు తమ వడ్డీ, బ్యాలెన్స్ వివరాల్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ద్వారా ఈపీఎఫ్వో మెంబర్ పాస్బుక్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, ఉమాంగ్ యాప్ ద్వారా పాస్బుక్ సెక్షన్లోకి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్వో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మిస్డ్ కాల్ అలర్ట్ కూడా ఉంది. ఖాతాదారులు తమ రిజిష్టర్డ్ మొబైల్ ద్వారా 9966044425 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో బ్యాలెన్స్ సమాచారం అందుతుంది.
అలాగే, 7738299899 నెంబర్కు రిజిష్టర్డ్ మొబైల్ నుంచి EPFOHO UAN అని మెసేజ్ పంపడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే, దీనికోసం ముందుగా యూఏఎన్ నెంబర్ను పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలతో లింక్ చేసుకుని ఉండాలి. ఈపీఎఫ్వోలో వడ్డీ జమ కావడం ఆలస్యమైనంత మాత్రాన తుది బ్యాలెన్స్లో తేడా ఉండదని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈపీఎఫ్వో ఇప్పుడు తన పోర్టల్ను కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.