TRAI on 5G | 5జీ స్పెక్ట్రం వేలంపై అనుసరించాల్సిన విధి విధానాల విషయమై ఈ నెలాఖరులోగానీ, వచ్చేనెల ప్రారంభంలో గానీ టెలికం శాఖకు సమర్పిస్తామని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. గతేడాది టెలికం శాఖ నుంచి ప్రతిపాదనలు స్వీకరించగానే ఈ విషయమై కసరత్తు ప్రారంభించామని ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా చెప్పారు.
బుధవారం ఆయన హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) ఆధ్వర్యంలో 5జీ: తర్వాతీ తరం టెక్నాలజీ అనే అంశంపై జరిగిన ఆన్లైన్ సదస్సులో మాట్లాడారు. స్పెక్ట్రం వేలానికి సంబంధించి చాలా పని చేయాల్సి ఉంటుంది. పలు టెక్నికల్ అధ్యయనాలు పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణంగా స్పెక్ట్రం వేలంపై సిఫారసులు చేయడానికి ఏడెనిమిది నెలల టైం పడుతుంది. కానీ ఈ దఫా మేం ఈనెలాఖరులోగానీ, వచ్చేనెల రెండోవారంలో గానీ టెలికంశాఖకు సిఫారసులు సమర్పిస్తాం అన్నారు.
ఆ వెంటనే ప్రభుత్వం స్పెక్ట్రం వేలానికి షెడ్యూల్ ప్రకటిస్తుందని భావిస్తున్నానని వఘేలా చెప్పారు. మరో నాలుగైదు నెలల్లో 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత 4జీ నెట్వర్క్నే 5జీ ఇంట్రడక్షన్కు ఉపయోగించుకోవచ్చునన్నారు.