విద్యానగర్, మార్చి 21 : కరీంనగర్ ఓమెగా సుశ్రుత దవాఖానలో వైద్యులు క్యాన్సర్ బారినపడ్డ పదహారేండ్ల బాలుడికి క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. పక్కటెముకలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించిన క్యాన్సర్ కణితిని శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. పదిలక్షల మందిలో కేవలం ఇద్దరిలో మాత్రమే కనిపించే ఈ అరుదైన వ్యాధికి రూ. 6 లక్షలు ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన ఎలుముల సృజిత్ (16) చెస్ట్ వాల్ క్యాన్సర్తో బాధపడుతూ గతేడాది డిసెంబర్ 2న ఓమెగా హాస్పిటల్లో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు క్యాన్సర్ పక్కటెముకలతో పాటు శ్వాస తీసుకోవడంలో కీలకమైన డయాఫ్రమ్, గుండెపై భాగంలో ఉండే పెరికార్డియం భాగాలకు ట్యూమర్ విస్తరించినట్లు నిర్ధారించారు. వెంటనే తొలగించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని సర్జరీ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 13న సృజిత్కు కీమో ప్రారంభించారు. ఓమెగా హాస్పిటల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో కార్డియోథొరాసిక్ సర్జన్, అనస్థీషియా వైద్యులతో కూడిన బృందంతో పాటు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జంపాని అనిల్ ఈనెల 10న ఏడు గంటల పాటు శ్రమించి క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా చేశారు. రోగికి క్యాన్సర్ సోకిన 6,7,8 పక్కటెముకలను తొలగించి, ఆ స్థానంలో ప్రాలీన్ మెష్ పెట్టి దానిపై ఎల్డీ ప్లాప్ అనే కండరాన్ని అమర్చారు. అలాగే క్యాన్సర్ సోకిన గుండెపై భాగంలో ఉండే పారను తొలగించడంలో పాటు డయాప్రమ్లో క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని తొలగించి ఆ భాగంలో కుట్లు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జంపాని అనిల్ మాట్లాడుతూ ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని మంగళవారం దవాఖాన నుంచి డిశ్చార్జి చేస్తున్నామని తెలిపారు. ఓమెగా శుశ్రుత హాస్పిటల్లో 24 గంటలు అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నామన్నారు. వివరాలకు పవన్కుమార్ 9849760819 నంబర్లో సంప్రదించాలని సూచించారు.