హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బాండ్ల విక్రయం ద్వారా ఈ నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రాష్ట్రం రుణ సమీకరణ చేయకుండా బడ్జెట్, ఇతర అప్పులను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం రెండు నెలలపాటు అడ్డుకున్నది. దీంతో తెలంగాణ రెండునెలల్లో రూ.8 వేల కోట్లు నష్టపోయింది. కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో ఎండగట్టారు. ద్వంద్వ వైఖరిని క్షుణ్ణంగా వివరిస్తూ ఇటీవలే రాష్ట్ర ఆర్థికశాఖ సుదీర్ఘ లేఖ రాసింది.
ఈ చర్యల ఫలితంగా కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ రుణ సమీకరణకు అవకాశం కల్పించింది. కేంద్రం అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. వాస్తవానికి ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్రానికి జీఎస్డీపీలో నాలుగు శాతం వరకు రుణాలు తీసుకొనేందుకు అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ సుమారు రూ. 11.5 లక్షల కోట్లు. ఈ లెకన తెలంగాణ 48 వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు అవకాశం ఉన్నది. అంటే నెలకు సుమారు రూ.4 వేల కోట్లు. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి వసతులు కల్పించడంతోపాటు పెట్టుబడులు ఆకర్షించి యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది.