తెలంగాణలోని రాచకొండను రాజధానిగా చేసుకొని వెలమరాజులైన రేచర్ల పద్మనాయకులు పరిపాలించారు. కాకతీయులకు సామంతులుగా కొంతకాలం ఉండి తర్వాత స్వతంత్రులైనారు. ఈ రాజుల్లో రేచర్ల అనవోతా నాయుడు, రావు మాదానీడు, సింగభూపాలుడు ముఖ్యులు. అనవోతానాయుడు మెదక్ జిల్లా రాయవరంలో వేయించిన ఒక శాసనం చాలా విశేషమైంది. ఇందులో రేచర్లపద్మనాయకుల వంశానుక్రమం చాలా వివరంగా తెలుస్తుంది. శాసన కాలం శ.సం. 1301 = క్రీ.శ. 1380, సిద్ధార్థి సంవత్సరం.
చతుర్థ కులానికి చెందిన, రేచర్ల వంశానికి చెందిన వెన్నమ మొదట పేర్కొనబడ్డాడు. అతని కొడుకు దాచయ. దాచయ గోరుకంటి కులానికి చెందిన పోచమ్మను వివాహం చేసుకున్నాడు. వారి కొడుకు సింగమ. ఇతని భార్య సింగమాంబ. వీరిద్దరికి అనవోత, మాధవ, వెన్నమ అనే ముగ్గురు కొడుకులు. అందులో అనవోతడు విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురామావతారంగా పేర్కొనబడ్డాడు. శత్రురాజులతో అనేక యుద్ధాలు చేశాడు. ఆ క్రమంలోనే ఇతడు సోమ వంశానికి చెందిన వినిపాల సూరను భీకర యుద్ధంలో సంహరించాడు. ప్రస్తుత శాసనం రాయసముద్రం అనే చెరువును ప్రజల ఉపయోగార్థం తవ్వించినట్లు తెలుస్తుంది. ఈ శాసన రచయిత భారద్వాజస గోత్రానికి చెందిన పోచనార్య.
ఈ శాసనంలో అనవోతడు “మనసిజ భుజబల విజిత సకల రిపుకులో, భుజబల భీమ. సోమ కుల పరశురామ, గజదళ విభాళ, పాండ్య దళ విభాల, యిరువెత్తుగండ, గండగోపాల, అరిరాయ, గాయగోవాళ, ఖడ్గనారాయణ, వివేక నారాయణ, కాకతీయ రాయస్థాపనాచార్య, వివిధ రణధుర్య బల్లరగండ, జంగుళి మన్నియర గండ, చలమర్తిగండ, ప్రతికూల రాయ భయంకర, శరణాగత రాయ, వజ్ర సంజర సమర మహేశ్వర, జయలక్ష్మీనివాస, బాహు ధరణీ వరాహ ప్రతిగండ భైరవ మూఱురాయ జగదళాది పరాక్రమ వివేక సంపాధితై:… వంటి బిరుదాలతో కీర్తించబడినాడు.
అనవోతడు తవ్వించిన ఈ రాయసముద్ర ము జనులకు ఆనందాన్ని, వారి తాపాన్ని హ రించేదిగా ఉండాలని, ఈ సముద్రం ఉన్నంతవరకు అనవోతడు చిరంజీవిగా ఉంటాడని, ఆ చంద్ర తారకంగా ఈ చెరువు వర్ధిల్లాలని, చివరగా మంగళ మహాశ్రీతో శాసనం ముగిసింది.
– భిన్నూరి మనోహరి