ముంబై: ఐపీఎల్లో స్పీడ్తో ఆకట్టుకుంటున్న ఉమ్రాన్ మాలిక్కు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్ర వార్నింగ్ ఇచ్చారు. అత్యంత వేగంతో బంతులు వెయ్యడం కాదు అని, అత్యంత తెలివిగా ఆ బంతిని సంధించాలని రవిశాస్త్రి అన్నారు. టోర్నీ ఆరంభంలో స్పీడ్తో ఇరగదీసిన మాలిక్.. గత మూడు మ్యాచుల్లో దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటర్లు అతన్ని పిచ్చి పిచ్చిగా కొడుతున్నారు. చివరి రెండు మ్యాచుల్లో అతను వంద రన్స్ సమర్పించుకున్నాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తొలి ఓవర్లోనే 20 రన్స్ ఇచ్చేశాడు.
ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ మీడియాతో ఉమ్రాన్ గురించి రియాక్ట్ అయ్యాడు. షార్ట్ ఫార్మాట్ గేమ్లో పేస్ బౌలింగ్తో ఉపయోగం ఉండదని, వేగాన్ని సరైన రీతిలో వాడుకోవాలన్నారు. 156 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం అద్భుతమే అని, కానీ సరైన స్థానంలో ఆ బంతుల్ని విసరకపోతే అప్పుడు ఆ బంతి 256 కిలోమీటర్ల వేగంతో బౌండరికీ వెళ్తుందని రవిశాస్త్రి అన్నారు. పేస్ వేయడం మంచిదే అని, కానీ సరైన ప్రాంతాల్లో ఆ బంతుల్ని వేయాలని, అడపాదడపా వేస్తూ బ్యాటర్లను సర్ప్రైజ్ చేయాలని శాస్త్రి అన్నారు. సరైన దిశలో బౌలింగ్ లేనప్పుడు, ఆ బంతి బ్యాటర్ నుంచి వేగంగా దూసుకువెళ్తుందని రవి తెలిపారు.