శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం భ్రమరాంబ చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రఘంటా సమేతుడైన మల్లికార్జునుడు రావణ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చండీ, దుర్గ, కాళి, లలితార్చన జరిగాయి. సాయంత్రం చంద్రఘంటాదేవి అలంకరణలో అమ్మవారు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. మండపంలో ఏర్పాటు చేసిన వాహనసేవపై ఆసీనులైన స్వామిఅమ్మవార్లకు పూజలు చేపట్టారు.
అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. చంద్రఘంటా దేవి సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. ఆలయ ప్రాకారోత్సవంలో ఈవో లవన్న, ఈఈ బాలమురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఆలయ పర్యవేక్షకులు శ్రీహరి, పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్రావు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనికుమార్, ఏఈఓ హరిదాస్, మల్లయ్య, సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఉత్సవాల సందర్భంగా భ్రామరి కళావేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
రేపు కూష్మాండ దుర్గ అలంకారంలో..
శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజు భ్రమరాంబాదేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మల్లికార్జునుడు కైలాస వాహన సేవపై నుంచి భక్తులను అనుగ్రహిస్తాడని ఈవో లవన్న చెప్పారు. కూష్మాండ దుర్గను ఉపాసంచడంతో రోగాలు, శోకాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరి ఆయువు యశస్సు వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.