Rashmika |కర్నూల్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం వల్ల 19 మంది ప్రయాణికులు బస్సులోనే దహనమయ్యారు. ఈ ప్రమాదం 03 గంటల ప్రాంతంలో సంభవించింది. మొత్తం 44 మంది ప్రయాణికులు బస్సులో ఉండగా, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన కడారి అశోక్ (27) బస్సులో మంటలు అంటుకున్న విషయాన్ని పసిగట్టగానే వెంటనే అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. మరో ప్రయాణికుడు తరుణ్, పని కారణంగా బస్సు ఎక్కకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కుమార్తె ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అలానే ఒక కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. ఇలా బస్సు ప్రమాదంలో మరణించిన వార విషాద గాథ ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంపై స్టార్ హీరోయిన్ రష్మిక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది.కర్నూలు బస్సు ప్రమాద వార్తతో నేను ఉలిక్కిపడ్డాను. చాలా బాధపడ్డాను. మండుతున్న బస్సు లోపల ఉన్న ప్రయాణికులు ఎంత బాధను అనుభవించారో.. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. చిన్నారులతో పాటు చాలా మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఒక కుటుంబం మొత్తం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. అలానే వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను అంటూ రష్మిక కామెంట్స్ చేసింది.మరోవైపు సోనూసూద్, కిరణ్ అబ్బవరం కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్ చేశారు. బస్సు ప్రమాదాల వలన ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్పటికైన కఠిన నిబంధనలు అమలు చేయండి అని సోనూసూద్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.