షాద్నగర్రూరల్, మార్చి 15 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేసేలా ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలోని గ్రంథాలయంలో నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలను అందజేశారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 6829 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నందున్న జిల్లా గ్రంథాలయంతో పాటు అన్ని మండలాల్లోని గ్రంథాలయాల్లో నిరుద్యోగులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
నిరుద్యోగులు వారికి అవసరమయ్యే స్టడీ మెటీరియల్ను బ్రాంచ్ ఇన్చార్జీల దృష్టికి తీసుకువస్తే, వాటిని కూడా అందిస్తామన్నారు. గ్రంథాలయలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో షాద్నగర్ గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి శేఖర్, డైరెక్టర్లు సుధాకర్, గడ్డం ఆంజనేయులు, శంకర్, గ్రంథాలయ అధికారి ప్రతాప్ పాల్గొన్నారు.