కడ్తాల్, మార్చి 29 : మానవ మనుగడకు నీరే ప్రాణాధారమని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. జల్శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్-2022, జాతీయ నీటి పురస్కారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నీటి బొట్టునూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో గ్రామాల్లో నీటి అవసరాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. ఇంట్లో నల్లాలకు ట్యాప్లు ఏర్పాటు చేసుకోవాలని, వాడుకున్న నీటిని బయటకు పోకుండా ఉండేందుకు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో 18 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. చెట్లు ఎక్కువగా ఉంటే వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందన్నారు. అనంతరం ఎక్కడ పడినా, ఎప్పుడు పడినా, నీటిని ఒడిసి పట్టండి అనే అంశంపై అధికారులు, ప్రజాప్రతినిధులు జల ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏపీఎం రాజేశ్వరి, వార్డు సభ్యులు భిక్షపతి, మహేశ్, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు అశోక్, నాగార్జున్, వెంకటేశ్, సురేశ్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.