కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాటలపై ఒకపక్క నిరసనలు చేస్తుండగా.. మరోపక్క వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలంటూ అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపుతున్నారు. దేశం మొత్తం ధాన్యం సేకరణ ఒకే విధంగా ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పంజాబ్ తదితర రాష్ర్టాల నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపడమేంటని ప్రశ్నిస్తున్నారు. అనవసర విషయాల్లో హడావిడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలను ఎందుకు ఒప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో కుమ్మక్కైనట్టు వ్యవహరించడం శోచనీయమని, రైతుల గోస పట్టని ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిప్రాంతాల నుంచి తీర్మానాల ప్రతులను తుఫానులా ఢిల్లీకి పంపి వెటకారంగా మాట్లాడే వారికి గుణపాఠం చెబుతామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మరింత ఉధృతంగా ఉద్యమించి కమలనాథులకు కనువిప్పు కలిగిస్తామని ఉమ్మడి జిల్లా వాసులు హెచ్చరిస్తున్నారు.
కొడంగల్, మార్చి 26 : యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాల్సిందేనని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తీర్మాన ప్రతులను కేంద్రానికి పంపిస్తున్నామన్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ర్టాల్లో పండించిన పంటలను కేంద్రం కొనుగోలు చేస్తున్నది, కానీ తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను కించపరిచినట్లుగా నూకలు తినాలనే విధంగా సంబోధించడం చాలా విచారకరమని పేర్కొన్నారు. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంత ఆహారం ప్రధానమని, కానీ ఈ విధంగా కించపరచడం భావ్యంకాదని హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక న్యాయం.. ఇతర ప్రభుత్వాలకు మరో న్యాయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రమేశ్రెడ్డి, సర్పంచ్లు అంజద్, ఫకీరప్ప, సావిత్రమ్మ, బాలమణి పాల్గొన్నారు.
బొంరాస్పేట మండలంలో..
బొంరాస్పేట, మార్చి 26 : యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని శనివారం మండలంలోని బురాన్పూర్లో గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు యాదగిరి, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఆదేశాల మేరకు మండల, పీఏసీఎస్లలో తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపిస్తామని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేశారు.
ధారూరు మండలంలో..
ధారూరు, మార్చి 26 : రబీ ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోశ్కుమార్ అన్నారు. శనివారం ధారూరులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
దోమ మండలంలో..
దోమ, మార్చి 26 : కేంద్రం మొండి వైఖరిని మార్చుకొని తెలంగాణ రైతులు పండించే వరి ధాన్యాన్ని కొని రైతులకు న్యాయం చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు దోమ పీఏసీఎస్ హెడ్ క్వార్టర్స్లో చైర్మన్ ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వడ్లు కొనాలని మూకుమ్మడిగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శేఖరయ్య, డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, వెంకటయ్య, మల్లేశం, భాస్కర్, ఎల్లమ్మ, కిష్టయ్య, హన్మంతునాయక్ పాల్గొన్నారు.
కొందుర్గు, జిల్లెడుచౌదరిగూడ మండలాల్లో..
కొందుర్గు, మార్చి 26 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేయాలని కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల్లోని ప్రజా ప్రతినిధులు తీర్మానం చేశారు. కొందుర్గుకు సంబంధించి తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డికి, జిల్లెడు చౌదరిగూడకు సంబంధించి ఎంపీడీవో వసంతలక్ష్మికి ప్రజాప్రతినిధులు తీర్మానం ప్రతులను అందజేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, హఫీజ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో..
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 26 : వరిధాన్యం కొనేంతవరకు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని పలు గ్రామాల సర్పంచ్లు పేర్కొన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనాల్సిందేనంటూ తీర్మానాలు చేశారు. ఉప్పరిగూడలో సర్పంచ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. అలాగే, పోచారం, రాయపోల్, కర్ణంగూడ, దండుమైలారం, ముకునూరు, కప్పాడు, తులేకలాన్, చర్లపటేల్గూడ, తుర్కగూడ, పోల్కంపల్లి, నాగన్పల్లి, ఎలిమినేడు గ్రామాల్లో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, పాలకవర్గం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుపై మొండి వైఖరి అవలంబిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని లేవనెత్తి ఢిల్లీలో నిరసనలు తెలుపుతామన్నారు.
కేశంపేట మండలంలో..
కేశంపేట, మార్చి 26 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట మండల పరిషత్లో శనివారం ఎంపీపీ రవీందర్యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సమావేశం తీర్మానించిన అంశానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు మూకుమ్మడి మద్దతు తెలిపారు. తీర్మానాన్ని ప్రజాప్రతినిధులు ఎంపీడీవోకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్ ఎంపీపీ అనురాధ, ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ పాల్గొన్నారు.
వికారాబాద్లో..
వికారాబాద్, మార్చి 26 : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని, వరి రైతులకు న్యాయం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలంయలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కేంద్రం వరి కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
నందిగామ మండలంలో..
నందిగామ, మార్చి 26 : రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శనివారం నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ ముఖ్య అతిథిగా హాజరై మండల పరిషత్ సభ్యులతో కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యాన్ని కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంజుల, ఎంపీటీసీలు లత, మాధవి, కో అప్షన్ సభ్యులు బేగ్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దోమ మండలంలో..
దోమ, మార్చి 26 : తెలంగాణలోని యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని ఎంపీపీ అనసూయ ఎంపీటీసీలతో కలిసి మండల అత్యవసర సమావేశాన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేశారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని అందరూ కలిసి తీర్మానించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సమాచారాన్ని పంపిస్తామని సభలో పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీ అనిత, ఎంపీటీసీలు పాల్గొన్నారు.