షాబాద్, అక్టోబర్ 28 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆర్థికంగా ఎదుగాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో రంగారెడ్డిజిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఏర్పాటు చేసిన రుణ విస్తరణ కార్యక్రమానికి హాజరైన ఆయన జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీధి వ్యాపారాలకు రుణాలు అందించడంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 2021-22కుగాను 16,366 సంఘాలకు రూ. 572 కోట్ల రుణాలు ఇప్పించేందుకు టార్గెట్గా పెట్టుకుని ఇప్పటివరకు 6,375 సంఘాలకు రూ. 274కోట్లు రుణాలు అందజేసినట్లు తెలిపారు. కరోనా వల్ల ఆర్థికంగా రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్దఎత్తున రుణ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాలను అభివృద్ధిపరుచుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. అన్ని బ్యాంకుల వారు పూర్తి సహకారం అందించి వందశాతం పూర్తి చేయాలని, రంగారెడ్డిజిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేయాలని బ్యాంకర్లు, జిల్లా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాస్, ఎస్బీఐ, యూబీఐ, కెనరా, యూకో బ్యాంకుల జీఎంలు జైదీప్ మిశ్రా, రవివర్మ, అమిత్ శ్రీవత్సల్, రిజ్వాన్, ఎస్బీఐ డీజీఎం శ్రీధర్బాబు, ఎల్డీఎం, డీఆర్డీఏ అదనపు పీడీ జంగారెడ్డి పాల్గొన్నారు.