ధారూరు, అక్టోబర్26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. మొక్కల పెంపకంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించొచ్చని భావించిన ప్రజలు మండలంలోని అన్ని గ్రామాల్లో జూలై, ఆగస్టు నెలల్లో రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, ఆలయాల ఆవరణల్లో, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, పొలాల వద్ద జోరుగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ప్రతి గ్రామంలో రోడ్ల కు ఇరువైపులా వివిధ రకాల మొక్కలు నాటి సం రక్షిస్తుండటంతో అవి ఏపుగా పెరిగి అందంగా కనిపిస్తున్నాయి. నర్సరీలతోపాటు పల్లెప్రకృతివనాల్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. నీడనిచ్చే మొక్కలతోపాటు పండ్లజాతి మొక్కలు నాటుతుండటంతో గ్రామాలకు హరితశోభ సంతరించుకుంది. మండలంలో 8 ఉన్నత పాఠశాలలున్నాయి. అవి నాగారం, ధారూరు, ధారూరు(బాలికల), మోమిన్కలాన్, తరిగోపుల, నాగసముందర్,కెరెళ్లి, కుక్కింద గ్రామాల్లో ఉన్నాయి. మోమిన్కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నాలుగేండ్లుగా ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో వివిధ రకాల సుమారుగా 1200పైగా మొక్కలను నాటగా అందు లో 1075 పైగా మొక్కలు బతికాయి. వేసవిలో మొక్క లు ఎండిపోకుండా నీరు పోసి ఉపాధ్యాయులు ,విద్యార్థులు కాపాడుతున్నారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదోతరగతి వరకు 130 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తుండగా ఆరుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. మొక్కలు ఏపుగా పెరిగి స్కూల్ ప్రాంగణమంతా హరిత శోభను సంతరించుకున్నది.
పాఠశాల పరిసరాలు పచ్చగా కనిపిస్తున్నాయి
హరితహారం కార్యక్రమంలో భాగంగా మోమిన్కలాన్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సుమారుగా 1200 మొక్కలను నాటగా.. అందులో 1075 మొక్కలు బతికాయి. నాటిన వాటిలో పండ్లు, ఔషధ, పూల మొక్కలున్నాయి. మొక్కలు ఏపుగా పెరిగి పాఠశాల ప్రాంగణమంతా పచ్చదనంగా కనిపిస్తున్నది.
-బాబుసింగ్ మండల విద్యాధికారి, ధారూరు మండలం