అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 23 : గతంలో పంచాయతీలు నిధులలేమితో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో అబ్దుల్లాపూర్ కొత్త కాంతులను సంతరించుకున్నది. ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రమైన వీధులు, సీసీ రోడ్లతో ఆదర్శంగా ముందుకెళుతున్నది. ఒకప్పుడు కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం రెండు ఎకరాల్లో పల్లె ప్రకృతివనం, చెత్త డంపింగ్ యార్డు, అధునాతన శ్మశానవాటిక, పారిశుధ్య నిర్వహణకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు, నర్సరీలో మొక్కలు పెంచుట వంటి వసతులతో గ్రామం ప్రగతి వైపు పరుగులు పెడుతున్నది. మొక్కలు నాటి కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
ప్రగతి పథంలో అబ్దుల్లాపూర్
పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధిలో ముందడుగు వేసింది. పంచాయతీకి కేటాయించిన సర్కారు నిధులతో పలు పనులు చేస్తూ అదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, అంతర్గత డ్రైనేజీల నిర్మాణం, వార్డుల్లో సీసీ రోడ్లు, డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్, రైతువేదిక, నర్సీరీలో మొక్కల పెంపకం పనులు నిర్వహించారు.
సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణ
గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు చేసి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. తడి-పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. చెత్తను వేరు చేసేందుకు ప్రతీ ఇంటికి రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గ్రామంలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసి కొత్త వెలుగులు తీసుకొచ్చారు. పంచాయతీ సిబ్బంది వీధులను రోజూ శుభ్రం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి పంచాయతీ నిధులతో పాటు అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ వినియోగిస్తున్నారు.
ఎటు చూసినా పచ్చదనమే..
హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నేడు పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇంటికో చెట్టు నినాదంతో ప్రతీ ఇంటికి పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేశారు. 2 ఎకరాల పల్లె ప్రకృతి వనంలో 5,300 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నర్సరీలో రాగి, ఉసిరి, చింత, గోరింటాకు, మందార, తులసి, దానిమ్మ, కానుగు, జామ, వేప, మునుగ, టేకు, నేరేడు, గన్నేరు మొక్కలకు నిత్యం ట్యాంకర్ ద్వారా నీరు పోసి సంరక్షిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి : కిరణ్కుమార్గౌడ్, సర్పంచ్
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాం. గడిచిన రెండేండ్లలో రూ.సుమారు 5 కోట్ల అభివృద్ధి జరిగింది. పల్లె ప్రగతిలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, స్నానపుగదులు, డంపింగ్యార్డు, నర్సరీ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తి చేశాం. దీంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. అక్కడక్కడ మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో దశలవారీగా అభివృద్ధిపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.
గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం