ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా పెరగనున్నది. ఇప్పటికే ఏటా వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న అన్నదాతలు.. ఈ సారి మరిన్ని ఎకరాలకు పెంచాలని చూస్తున్నారు. ప్రభుత్వం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించడంతో అన్నదాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాయగూరల సాగుకు భూములు అనుకూలంగా ఉండడంతో జిల్లా రైతులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఇప్పటికే కూరగాయల హబ్గా ఉన్న మన జిల్లాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మెజార్టీ కూరగాయలు, ఆకుకూరలు సరఫరా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏటా 45,460 ఎకరాల్లో 3,01,723 మెట్రిక్ టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతుండగా 40శాతం నగరానికి సరఫరా అవుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో 28వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా వచ్చే మూడేండ్లలో దీన్ని 50వేల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. సర్కారు అందిస్తున్న సబ్సిడీలతో ఈ సారి మరింత ఎక్కువ మంది రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. స్వల్పకాలంలో పంట చేతి కందడంతో లాభాలను ఆర్జిస్తున్నారు. అత్యధికంగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు కూరగాయల హబ్గా మారుతున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి మెజార్టీ కూరగాయలు, ఆకుకూరలు సరఫరా చేస్తుండడం గమనార్హం. వరితో పోలిస్తే సాగునీరు ఖర్చు సైతం తక్కువగా ఉంటున్నందున ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఎకరం వరి పంటకు వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో కూరగాయలు సాగుచేయవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రతీ వారం డబ్బు చేతికందే అవకాశం ఉన్నది. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉన్న కూరగాయల సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని సైతం అందిస్తున్నది. హైదరాబాద్ నగరానికి అనుకొని ఉన్నందున మార్కెటింగ్ సదుపాయం ఉండడంతో కూరగాయల పంటలు సిరులు కురిపిస్తున్నాయి.
రంగారెడ్డి, నవంబర్ 11, (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతాంగం సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆధునిక పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా పదేండ్లకుపైగా కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వరితోపాటు ఇతర సంప్రదాయ పంటల సాగు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. హైదరాబాద్ మహా నగరానికి మెజార్టీ కూరగాయలు, ఆకుకూరలు సరఫరా చేస్తుండడం గమనార్హం. జిల్లాలోని శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, మహేశ్వరం, షాద్నగర్, ఫారూఖ్నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, ఆమనుగల్లు మండలాల్లో అధిక మొత్తంలో కూరగాయల సాగు చేస్తున్నారు. చేవెళ్ల, శంకర్పల్లిలో అధిక మొత్తంలో క్యారెట్, క్యాలీప్లవర్ సాగవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా టమాట సాగు చేస్తున్నారు. జిల్లాలో 3,01,723 మెట్రిక్ టన్నుల కూరగాయలను సాగు చేస్తుండగా, వీటిలో 60 శాతం టమాట సాగు చేస్తుండడం గమనార్హం. మరో 20 శాతం ఆకుకూరలను సాగు చేస్తున్నారు. హైదరాబాద్లోని అన్ని మార్కెట్లలో లభించే క్యారెట్, కాలిప్లవర్ 95 శాతం జిల్లాలో ఉత్పత్తి అయినవే. వీటితోపాటు బెండకాయ, బీన్స్నూ అధిక మొత్తంలో జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. హైదరాబాద్లోని బోయిన్పల్లి, మెహిదీపట్నం, సరూర్నగర్, ఎల్బీనగర్ ఏఎంసీ, ఎర్రగడ్డ రైతుబజార్లకు కూరగాయలను తరలిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.
కూరగాయల హబ్గా జిల్లా..
రంగారెడ్డి జిల్లా కూరగాయల సాగుకు హాబ్గా మారుతున్నది. ఓవైపు రియల్ రంగంలో దూసుకుపోతూ వ్యవసాయ సాగు భూములు తగ్గుతున్నా.. కూరగాయల సాగు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏటా కూరగాయల సాగు పెరుగుతుండడం గమనార్హం. ఒకట్రెండు అర్బన్ మండలాలు మినహా మిగతా మండలాల్లో కూరగాయల సాగుకే ప్రాధాన్యతనిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి జిల్లా ఆనుకొని ఉండడం, హైదరాబాద్ జనాభా రోజురోజుకు పెరుగుతుండడంతో కూరగాయల అవసరం పెరుగుతున్నది. హైదరాబాద్ నగరానికి 40 శాతం కూరగాయలను జిల్లా నుంచే సరఫరా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయానికి తగినట్లుగా సాగు చేస్తూ వస్తున్నారు.
పండ్ల సాగు అధికమే..
జిల్లాలో సాగు చేస్తున్న కూరగాయాల్లో హైదరాబాద్కు రోజుకు 395 మెట్రిక్ టన్నుల కూరగాయలు సరఫరా అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 24,46,265 మంది ప్రజలు ఉండగా, వీరిలో ఏడాదిలో కావాల్సిన కూరగాయలు 1,58,718 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఏటా జిల్లావ్యాప్తంగా 45,460 ఎకరాల్లో 3,01,723 మెట్రిక్ టన్నుల కూరగాయలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లా అవసరాలు పోను హైదరాబాద్కు ఏటా 1,43,004 మెట్రిక్ టన్నుల
కూరగాయలను సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో సాగు చేస్తున్న పండ్లలో 70 శాతానికిపైగా పండ్లను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రధానంగా మామిడి, జామ పండ్ల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో పండ్ల తోటల సాగుకు సంబంధించి మొత్తం 25,794 ఎకరాల్లో 1,57,182 మెట్రిక్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాకు 47,999 మెట్రిక్ టన్నుల పండ్లు కావాల్సి ఉండగా, మరో 1,08,586 మెట్రిక్ టన్నుల పండ్లను హైదరాబాద్లోని వివిధ పండ్ల మార్కెట్లకు తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 25,794 ఎకరాల్లో అధికంగా మామిడి, జామ తోటలు సాగు చేస్తున్నారు. 20,208 ఎకరాల్లో మామిడి పండ్లు, 3890 ఎకరాల్లో జామ పండ్లను, 353 ఎకరాల్లో దానిమ్మ, 360 ఎకరాల్లో సపోట, 443 ఎకరాల్లో ఆరెంజ్ పండ్ల తోటలను సాగు చేస్తున్నారు.
కూరగాయల సాగుకు ప్రాధాన్యం..
ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా కూరగాయల సాగుకు జిల్లా రైతాంగం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లా అంతటా కూరగాయల సాగుకు అనుకూలంగా ఉండడంతో అన్ని మండలాల్లోని కూరగాయలు సాగు చేస్తున్నారు. వరితోపాటు ఇతర సంప్రదాయ పంటలను సాగు చేసి నష్టపోకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులతో కూరగాయల సాగు చేసి అధిక లాభాలను పొందడంతో ఆర్థికంగా బలోపేతం కావచ్చు. జిల్లాలో కూరగాయల సాగు చేపట్టే రైతులకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.