షాబాద్, నవంబర్ 6 : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం దేశానికే తలమాణికంగా నిలిచిందని, రైతును రాజు చేయాలనే ప్రభుత్వం ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వానకాలంలో లక్షా 70వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అందుకు తగినట్లుగా గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లాలో 38 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్-ఏ రకానికి రూ. 1960, సాధారణ రకానికి రూ.1940 అని తెలిపారు.
మద్దతు ధరకు జాగ్రత్తలు పాటించాలి..
మద్దతు ధర లభించాలంటే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యంలో తాలు, పొల్లు లేకుండా చూడాలన్నారు. తేమ శాతం కచ్చితంగా 17శాతం లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. టోకెన్ ప్రకారం కేటాయించిన రోజు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత రైతులు విధిగా రసీదు పొందాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో ఫోన్కు ఓటీపీ నెంబర్ కోసం తప్పక ఫోన్ వెంట తీసుకురావాలన్నారు. రైతులు తమ ఫోన్ నంబర్కు ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాలన్నారు. ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబర్, కలెక్టర్తో నియమించబడిన అధికారి ధ్రువీకరణ పత్రం జతచేయాలని సూచించారు. బ్యాంకు ఖాతా పనిచేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల నుంచి ధ్రువీకరించుకోవాలని తెలిపారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్స్ను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మనోహర్రాథోడ్, శ్యామాలక్ష్మి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ధాత్రిదేవి, టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ ఇర్ఫాన్, కొనుగోలు కేంద్రాల అసోసియేషన్ చైర్మన్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.