రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్లకు నిధులు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లాకు రూ.10.81 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అందులో జిల్లా పరిషత్కు రూ.5.44 కోట్లు, మండల పరిషత్లకు రూ.5.37 కోట్లు కేటాయించారు. వికారాబాద్ జిల్లాకు రూ.9.41 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అందులో జిల్లా పరిషత్కు రూ.4.74 కోట్లు, మండల పరిషత్లకు రూ.4.67 కోట్లు మంజూరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నిధులతో జిల్లా, మండల పరిషత్ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలు అభివృద్ధి చెందనున్నాయి.ఈ నిధులతో స్థానిక సంస్థలు బలోపేతమవుతాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నది. ఈ మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్లకు భారీగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను జిల్లా, మండల పరిషత్ల అభివృద్ధికి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం రూ.10.81కోట్లు విడుదలయ్యాయి. ఇందులో జిల్లా పరిషత్కు రూ.5.44కోట్లు, మండల పరిషత్లకు రూ. 5.37కోట్లు కేటాయించారు. నిధుల విడుదలపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడుతాయని అభిప్రాయపడుతున్నారు.
నిధుల కేటాయింపు ఇలా..
జిల్లా పరిషత్కు విడుదలైన రూ.5.44కోట్ల నిధుల నుంచి జిల్లా పరిషత్ (జనరల్)కు రూ.4.10కోట్లు, జిల్లాపరిషత్ (ఎస్సీ)లకు రూ. 94లక్షలు, జిల్లా పరిషత్ (ఎస్టీ) లకు రూ. 40లక్షలు కేటాయించారు. అలాగే మండల పరిషత్ల నిధులు రూ. 5.37 కోట్ల నుంచి మండల పరిషత్(జనరల్)కు రూ.4.05కోట్లు, మండల పరిషత్(ఎస్సీ)లకురూ.93లక్షలు, మండల పరిషత్(ఎస్టీ)లకు రూ.39కోట్లు కేటాయించారు.
స్థానిక సంస్థల బలోపేతం..
గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్లకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నది. దీంతో స్థానిక సంస్థల బలోపేతానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఆయా కేటగిరీలవారీగా మంజూరైన నిధులతో గ్రామాలు, కాలనీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీల కాలనీలు అభివృద్ధి చెందనున్నాయి. ప్రజల పురోగతికి ఈ నిధులు సక్రమంగా వినియోగించేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
వికారాబాద్ జిల్లాకు..
పరిగి, డిసెంబర్ 5 : స్థానిక సంస్థల అభివృద్ధి కోసం వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం రూ.9.41కోట్లు విడుదల చేసింది. ఇందులో జడ్పీకి రూ.4.74 కోట్లు, మండల ప్రజా పరిషత్లకు రూ.4.67కోట్లు కేటాయించింది.
కేటగిరీలవారీగా..
జడ్పీకి రూ.4,73,95,390 నిధులు విడుదలకాగా.. ఇందులో జనరల్కు రూ. 3,57,87, 045, ఎస్సీకి రూ. 80,61,549, ఎస్టీకి రూ.35,46,796 కేటాయించారు. అలాగే జిల్లాలోని 18 మండల పరిషత్లకు రూ.4,67,36,431 మంజూరుకాగా.. ఇందులో జనరల్కు రూ.3,52,89,482, ఎస్సీకి రూ.79,49,461, ఎస్టీకి రూ.34,97,488 ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను ఆయా మండలాల్లోని జనాభా ప్రాతిపదికన కేటాయించారు.
అభివృద్దికి తోడ్పాటు…
పెద్ద మొత్తంలో నిధులు విడుదలకావడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉన్నది. జనరల్ కేటగిరి కింద మంజూరైన నిధులతో ఎక్కడైనా పనులు చేయించవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు మంజూరైన నిధులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే వినియోగించనున్నారు. తద్వారా ఎస్సీ కాలనీలు, గిరిజనతండాలు మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది. మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం..
స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లా పరిషత్లు, మండల పరిషత్లకు నిధులు మంజూరు చేయడం సంతోషకరం. నిజమైన గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఈ నిధులు గ్రామాలు, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలకు తగిన నిధులు విడుదల చేస్తున్నారు. ఇందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావుల సహకారం మరువలేనిది. వీరందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-డాక్డర్ గడ్డం రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ
అభివృద్ధికి అవకాశం..
ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్లకు నిధులు విడుదల చేయడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. స్థానిక సంస్థలు మరింత పురోభివృద్ధి సాధించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనతో జీవన ప్రమాణాల పెంపునకు అవకాశం ఏర్పడనున్నది.
-కరణం అరవిందరావు, ఎంపీపీ, పరిగి మండలం