హైదరాబాద్ : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా రాంగోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్టలో మసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం మంత్రి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు నెల రోజులు ఎంతో నిష్ఠతో ఉపవాసం పాటిస్తారన్నారు. వారు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఎప్పటి నుండో వస్తుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేయడమే కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.