న్యూఢిల్లీ: సుమధుర స్వర కోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల రాజ్యసభ ఇవాళ ఘన నివాళి అర్పించింది. క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు. సభను గంట సేపు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. లతాజీ మృతి పట్ల వెంకయ్య తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో భిన్నత్వం తరహాలో ఆమె స్వరంలో ఆ శక్తి ఉందని ఆయన అన్నారు. సుమారు 25వేల పాటలకు పైగా ఆమె రికార్డ్ చేశారని, ఏడు దశాబ్ధాల పాటు దేశంలో ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని ఆమె తన గళంలో వినిపించినట్లు వెంకయ్య అన్నారు. 1999 నుంచి 2005 వరకు ఆమె రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్నట్లు తెలిపారు. ఓ లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ను ఈ దేశం కోల్పోయినట్లు ఆయన చెప్పారు. లతా మంగేష్కర్ గొప్ప మానవతామూర్తిని ఆయన అన్నారు. ఇండియన్ మ్యూజిక్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆమె మరణంతో ఓ శకం ముగిసినట్లు ఆయన చెప్పారు. మ్యూజిక్ ప్రపంచంలో పూడ్చలేని లోటును మిగిల్చి వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. లతాజీ మృతికి నివాళిగా సభ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు. ప్రభుత్వ లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు ఆదివారం ముంబైలో ముగిసిన విషయం తెలిసిందే.