జైపూర్ : స్వరాష్ట్రంలో సొంత పార్టీలో రగిలిన చిచ్చుతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేయకపోవచ్చని భావిస్తున్నారు. గతంలో పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్కు రాజస్దాన్ సీఎం పదవిని అప్పగిస్తే ఊరుకునేది లేదని తెగేసి చెబుతూ దాదాపు 80 మందికి పైగా గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ రాజీనామా లేఖలు సమర్పించారు. మరోవైపు రాజస్ధాన్లో ప్రస్తుత పరిస్ధితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్లను కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ కోరారు.
ఇక 2020 జులైలో తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సచిన్ పైలట్ సోనియా, రాహుల్ గాంధీలు జోక్యం చేసుకుని గెహ్లాట్ వర్గంపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాజస్ధాన్లో పార్టీ వ్యవహారాలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను రాజస్ధాన్కు పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై అశోక్ గెహ్లాట్నుంచి వేణుగోపాల్ వివరణ కోరారు.
గెహ్లాట్ వర్గీయుల్లో ఒకరికి సీఎం పదవిని కట్టబెట్టాలని, సచిన్ పైలట్ను సీఎంగా నియమిస్తే వ్యతిరేకిస్తామని ఆదివారం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అధిష్టానం దూతలకు స్పష్టం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాతే రాజస్ధాన్లో నాయకత్వ మార్పు అంశాన్ని చేపడతామని పార్టీ నాయకత్వం సంకేతాలు పంపుతోంది. నాయకత్వ మార్పు విషయంలో అశోక్ గెహ్లాట్ సూచించిన వారినీ పరిగణనలోకి తీసుకుంటామని చెబుతోంది.