Raj Thackeray | మహారాష్ట్ర పూణేలో కొందరు పీఎఫ్ఐ మద్దతుదారులు పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నినాదాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ఠాక్రే తీవ్రంగా స్పందించారు. సదరు వ్యక్తులకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. హిందువులు, మరాఠీలు ఈ విషయాన్ని తమ చేతుల్లో తీసుకుంటే.. అప్పుడు ఆ దుష్టులంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని ప్రశ్నించారు.
ఇదే అదే జరిగితే పండుగల సమయంలో అశాంతి నెలకొంటుందుని, తనను రెచ్చగొట్టద్దంటూ సూచించారు. ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వెంటనే స్వస్తి పలికితే బాగుంటుందని హితవు పలికారు. పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తే హిందువులు మౌనంగా ఉండరని ట్వీట్ చేస్తూ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లను ట్యాగ్ చేశారు. దేశ వ్యతిరేకత అంశాలతో కూడిన ఈ వ్యాధిని వెంటనే నిర్మూలించడం మంచిదన్న రాజ్ఠాక్రే.. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ముగింపు పలకడం మంచిదని సూచించారు.
పాక్ అనుకూల నినాదాలు చేసే మానసిక స్థితి ఉన్నవారు.. వారి మతాన్ని పట్టుకుని పాక్కు వెళ్లిపోవాలని, ఇలాంటి డ్రామాలను దేశంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులను కోరుతున్నానన్నారు. దేశంలోని హిందువులు మౌనంగా ఉండరని, తర్వాత ఏమి జరుగుతుందనే వివరాలలోకి వెళ్లడం నాకు ఇష్టం లేదని రాజ్ఠాక్రే పేర్కొన్నారు.