మెండోరా: ప్రకృతి అందాలు ఎప్పుడు తిలకించినా అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ దృశ్యం మదిలో ఒక జ్ఞాపకంలా ఎప్పటికీ మిగులు పోతుంది. అలాంటి దృశ్యమే ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల వద్ద కొద్దిసేపు కనువిందు చేసింది. ఒకవైపు ప్రాజెక్ట్ నుంచి విడుదల అవుతున్న నీరు, మరోవైపు ఈ నీటిపై ఇంద్రదనస్సు తేలియాడుతున్నట్లుగా కనిపించింది. మరోవైపు జాలారి ఇంద్రదనస్సును పట్టుకునేట్లుగా వల విసిరే సన్నివేశం సందర్శకులకు మరింతగా ఆకట్టుకుంది.
ఆదివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు రావడంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) సామర్థ్యం కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు( 89.763 టీఎంసీల) నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.