మనీలా, డిసెంబర్ 19: ఫిలిప్పీన్స్లో రాయ్ తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వేలాది చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తుఫాన్ కారణంగా 146 మంది చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే 72 మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 8 లక్షల మందిపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించిందని అధికారులు తెలిపారు. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. 227 పట్టణాలు పూర్తిగా అంధకారంలో చిక్కుకొన్నాయి.