న్యూఢిల్లీ: వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సీబీఐ విప్పింది. ఈ కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ సీటు మాత్రమే కాదు, గవర్నర్ హోదా ఇప్పిస్తామంటూ కూడా నిందితులు వంద కోట్లు వసూల్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. కొన్ని ఫోన్ కాల్స్ను పరిశీలించిన సీబీఐ.. ఆ కేసులో కొందర్ని అరెస్టు చేసింది.
మహారాష్ట్రకు చెందిన కర్మాల్కర్ ప్రేమ్కుమార్ బంద్గర్, కర్నాటవాసి రవీంద్ర విటల్ నాయక్, ఢిల్లీ నివాసి మహేంద్రపాల్ అరోరా, అభిషేక్ బూరాలను అరెస్టు చేశారు. రాజ్యసభ సీటుతో పాటు గవర్నర్ హోదా, ప్రభుత్వ సంస్థల్లో చైర్మెన్ పదవులు ఇప్పిస్తామంటూ ఆ ముఠా మోసాలకు పాల్పడినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కర్మాల్కర్తో కలిసిన అభిషేక్ బూర.. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చేతులు కలిపి, ఆ పోస్టులు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.