న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్ను అంటిస్తున్నట్లన్నమాట. ఆర్ అంటే ఉత్పత్తి రేటు. ఒకవేళ ఆర్ వాల్యూ 1 సంఖ్య లోపు ఉంటే, అప్పుడు కరోనా మహమ్మారి అదుపులో ఉన్నట్లు లెక్క. ఐఐటీ మద్రాస్ గణితశాస్త్ర శాఖ ప్రొఫెసర్ నీలేశ్ ఎస్ ఉపాధ్యాయ, ప్రొఫెసర్ ఎస్ సుందర్లు ఆర్ వాల్యూను కంప్యూటింగ్ మోడలింగ్ ద్వారా తేల్చారు. ప్రస్తుతం ఇండియా ఆర్ వాల్యూ 1.3గా ఉంది. అయితే ఇప్పుడే నాలుగవ వేవ్ మొదలైందని చెప్పడం తొందరపాటే అవుతుందని మరో ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ జా తెలిపారు. ప్రజల్లో ఇమ్యూనిటీ ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేమని, మూడవ వేవ్ సమయంలో వైరస్ సోకిన వారికి ఇప్పుడు మళ్లీ సోకుతుందా లేదా అన్నది తెలియదని ఆయన అన్నారు. ముంబై, చెన్నై, కోల్కతా లాంటి నగరాల్లో కేసులు మరీ తక్కువగా ఉన్నాయని, అక్కడ ట్రెండ్స్ అంచనా వేయలేమని ప్రొఫెసర్ తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా 15,079 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 33 మంది కరోనాతో మరణించారు.