దళితబంధులాగే బీసీ బంధును తెస్తామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. అలాంటి నేతను తిట్టాలని బీజేపీ నేతలు నాకు ఫోన్చేశారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికో గురుకులం ఏర్పాటుచేశారు. బీసీ ఆడపిల్లల పెండ్లిళ్లకు ఎవరూ అడగకపోయినా కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారు. బీసీ బాంధవ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం బీసీలందరిపై ఉన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి, టీఆర్ఎస్ను గెలిపించాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీని ఇక్కడ ఓడిస్తేనే ఢిల్లీలో సెగ తగులుగుతుందని ప్రకటించాయి. బీసీ కుల గణనకు ససేమిరా అంటున్న బీజేపీపై 120 బీసీ సంఘాలు ఏకమై జంగ్ ప్రకటించాయి. బీజేపీకి ఓటేస్తే దుర్మార్గానికి చోటు ఇచ్చినట్టేనని స్పష్టంచేశాయి. బీసీ జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీకి హుజూరాబాద్లో తగిన గుణపాఠం చెప్తేనే బీసీల తడాఖా తెలుస్తుందని పేర్కొన్నాయి. హైదరాబాద్లోని ఓ హోటల్లో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు మంగళవారం సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలోనే బీసీల అభ్యున్నతికి అనేక పథకాలు తెచ్చిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో చెప్పాలని నాయకులు డిమాండ్చేశారు. హుజూరాబాద్లో బీజేపీని ఓడించి బీసీలు తలుచుకొంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఆ పార్టీకి స్పష్టమైన సందేశం ఇవ్వాలని సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, బీజేపీ నేతలకు చేతనైతే బీసీ గణన చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్చేశారు.
బీసీలు సత్తా చాటాలి
బీసీ కుల గణన విషయంలో బీజేపీ వైఖరిని స్పష్టంచేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. బీసీల కోసం ఒక హాస్టల్ కూడాఏర్పాటుచేయని బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో దళితబంధులాగే బీసీ బంధును తెస్తామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారని, అలాంటి నేతను తిట్టాలని బీజేపీ నేతలు తనకు ఫోన్చేశారని మండిపడ్డారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికో గురుకులం ఏర్పాటుచేశారని, బీసీ ఆడపిల్లల పెండ్లిళ్లకు ఎవరూ అడగకపోయినా కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారని తెలిపారు. బీసీ బాంధవ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం బీసీలందరిపై ఉన్నదని చెప్పారు. బీజేపీలోని అనేకమంది బీసీ నేతలు తమకు కనీస గౌరవం దక్కటంలేదని మథనపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హుజూరాబాద్లో బీజేపీని ఓడించి బీసీ జాతి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటేస్తే దుర్మార్గానికి చోటిచ్చినట్టేనని తేల్చిచెప్పారు. తాను రాజకీయం చేయటం లేదని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్లాగా భూములు కబ్జా చేయలేదని స్పష్టంచేశారు. హుజూరాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా బీసీ జాతిని ఏకంచేసి ఉద్యమిస్తామని ప్రకటించారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు కోలా జనార్ధన్, విజయేందర్సాగర్, అంజి, జయంతిగౌడ్, మురళీకృష్ణ, టీ పల్లవి, రాజ్యలక్ష్మి, జగదీశ్వర్, సైదులు, శివమ్మ, నరహరి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి కొమ్ముకాయొద్దు
లాభాల్లో నడిచే ప్రభుత్వరంగ సంస్థలను అ మ్ముతున్న బీజేపీకి ఎవ రూ కొమ్ముకాయొద్దు. దశాబ్దాలుగా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఆర్ కృష్ణయ్యపై బీజేపీ నేతల అసత్య ప్ర చారాన్ని ఖండిస్తున్నాం. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
– దానకర్ణాచారి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్.
బీజేపీకి చుక్కలు చూపిద్దాం
బీజేపీ నేతలు మాట్లాడితే తాము బీసీని ప్రధానమంత్రిని చేశామంటారు. ఇప్పుడు దేశమంతా తమ కుల గణన చేపట్టాలని బీసీలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించటంలేదు? ఏటా కోటిన్నర ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలిచ్చింది? పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచుతున్న బీజేపీకీ హుజూరాబాద్లో ఓటర్లు చుక్కలు చూపించాలి. బీసీలంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలి.
– శారద, బీసీ సంఘం నాయకురాలు.
రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కులేదు
రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కులేదు. బీజేపీ బీసీ వ్యతిరేక విధనాలకు వ్యతిరేకంగా ఉద్యమం హుజూరాబాద్ నుంచే మొదలైంది. 120 బీసీ సంఘాలు ఏకమై బీజేపీపై సమరశంఖం పూరించాయి. హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కసాయిమూకల చేతిలో చిక్కారు. బీజేపీ నేతల కుట్రలను తిప్పికొట్టి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించుకొనేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు.
– రాజారాంయాదవ్, టీఆర్ఎస్ నేత.