న్యాల్కల్, ఫిబ్రవరి 2 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి గ్రామస్తులు, దాతలు, ఉపాధ్యాయుల సమష్టి సహకారంతో మండలంలోని మెటల్కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కార్పొరేట్కు దీటుగా నడుస్తున్నది. పాఠశాలలో సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, కంప్యూటర్లు, జనరేటర్, జిరాక్స్ మిషన్, స్వచ్ఛమైన మినరల్ తాగునీరు, విద్యార్థులకు డిజిటల్ విధానంలో బోధిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, తరగతి గదుల్లో శాస్త్రవేత్తలు, ప్రముఖుల చిత్రపటాలు, కేంద్ర, రాష్ట్ర చిహ్నాలు, సందేశాత్మక సూక్తులు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. తెలుగు, ఆంగ్ల విద్యా బోధనతో ఆదర్శంగా నిలుస్తున్న మెటల్కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం..
మండలంలోని చాల్కి జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ, మండల ఇన్చార్జి విద్యాధికారిగా ప్రభాకర్రావు పనిచేశారు. 2015 జరిగిన బదిలీల్లో భాగంగా మండలంలోని మెటల్కుంట జిల్లా పరిషత్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. పాఠశాలను కార్పొరేట్కు దీటుగా అన్ని సౌకర్యాలను కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కంకణం కట్టుకున్నారు. సొంత డబ్బులతో పాటు దాతలు, గ్రామస్తుల సహకారంతో ప్రైవేట్ను మించిన సౌకర్యాలను కల్పించి పాఠశాల రూపురేఖలను మార్చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు, మైక్లను ఏర్పాటు చేశారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్లు, జనరేటర్, జిరాక్స్ మిషన్, స్వచ్ఛమైన మినరల్ తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు. గోడలపై వేయించిన తెలంగాణ, భారతదేశం చిత్రపటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో 393 మంది విద్యార్థులుండగా, 168 మంది తెలుగు, 225 మంది ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నారు. పాఠశాలలో 15 మంది టీచర్లు విధులు నిర్వహిస్తుండగా, కొద్ది రోజుల క్రితం నలుగురు టీచర్లు బదిలీపై వెళ్లారు. పాఠశాలలో తొలిసారి డిజిటల్ తరగుతుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన సీడీలను కొనుగోలు చేసి విద్యార్థులకు పాఠాలను చెబుతుండడంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.డిజిటల్ ప్రదర్శన ద్వారా అన్ని సబ్జెక్టులనూ విశ్లేషణాత్మకంగా బోధిస్తుండడంతో విద్యార్థులు ఇష్టంగా చదువుకుంటున్నారు.
ఇంగ్లిష్ మీడియం కోసం క్యూ కడుతున్నారు..
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నం. దాత లు, గ్రామస్తులు, ఉపాధ్యాయుల సమష్టి సహకారంతో విద్యార్థులకు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో డిజిటల్ బోధన అందిస్తున్నాం. 2015లో 248 మంది విద్యార్థులుండగా, నేడు 398 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. పాఠశాలలో తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చేర్పించేందుకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది.
ప్రభాకర్రావు, పీజీ హెచ్ఎం, మెటల్కుంట
విద్యార్థులకు ఎంతో మేలు
‘మన ఊరు-మనబడి’ కార్యక్ర మంతో విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది. మా పాఠశాలలో తెలుగుతో పాటు ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ప్రైవేట్కు దీటుగా పాఠాలను డిజిటల్లో బోధిస్తూ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తున్నాం. పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్న హెచ్ఎం ప్రభాకర్రావుకు ఉపాధ్యాయులందరం చేదోడు వాదోడుగా ఉంటు న్నాం. దాతల సహకారంతో పాఠశాలలో చాలా సౌకర్యాలు వచ్చాయి.
సంజీవ్కుమార్, ఉపాధ్యాయుడు, మెటల్కుంట
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. ఆంగ్ల బోధన అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వెసులుబాట కలుగుతుంది. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు సర్కారు బడికి వస్తారు. ఆంగ్ల బోధన అమలుతోపాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తరగతి గదులు, టీచర్ల సంఖ్యను పెంచాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
గంగామోహన్, టీస్యూటీఎఫ్, అధ్యక్షుడు, న్యాల్కల్ మండలం
హర్షించదగిన విషయం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందిస్తే అన్నిరంగాల్లో అత్యున్నత స్థాయిలో చేరుకోగలరనే నమ్మకం ఏర్పడుతుంది. పేదల బతుకుల్లో వెలుగునింపినట్లవుతుంది. ఆంగ్లంలో చదివే వారికి అన్నిరంగాల్లో అవకాశాలు ఉంటాయి. ‘మన ఊరు-మన బడి’కార్యక్రమంతో ప్రైవేట్ ఫీజుల భారం తగ్గుతుంది.ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి.
పీటర్రాజ్, పూర్వ విద్యార్థి, సర్పంచ్, మెటల్కుంట ప్రైవేటులో చదవినట్లు ఉంది..
పాఠశాలలో సార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు పాఠాలను చెబుతుండడంతో ప్రైవేటులో చదవినట్లు ఉంది. వివిధ పాఠ్యంశాలపై విశ్లేషించి అర్థమయ్యేలా వివరిస్తున్నారు.అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించి, డిజిటల్లో విధానంలో పాఠాలను చెబుతుంటే వింటూనే ఉండాలనిపిస్తున్నది. మా చదువుల కోసం ఉపాధ్యాయులు చూపే ఆప్యాయత మరిచిపోలేం.
నందిని, విద్యార్థిని, మెటల్కుంట