నాగర్కర్నూల్ : ప్రధానిగా పీవీ నరసింహారావు (PV Narasimha Rao) దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Mla Marri Janardan) అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా లో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కుమారుడు ప్రభాకర్రావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు పీవీ సమర్ధవంత ప్రధానిగా సేవలందించారని కొనియాడారు. తెలంగాణకు చెందిన వ్యక్తి దేశానికి ప్రధానిగా కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని, ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా నేడు దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుందని అన్నారు. పీవీ నడిచిన బాటలో ప్రజాప్రతినిధులు నడవాలని సూచించారు. అనంతరం జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొన్నారు.