మల్కాజిగిరి, జనవరి 27: ప్రజల దాహార్తిని తీర్చాడానికి సీఎం కేసీఆర్ సంకల్పించి ఇంటికి ఇరవై వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటికి ఉచితంగా నెలకు ఇరవై వేల నీటిని సరఫరా చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలోని 70వేల నీటి కనెక్షన్లకు 2020డిసెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు 13నెలలకుగాను రూ.1.88కోట్ల బిల్లులు మాఫీ చేశారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీలలో 1,03,198 ఇండ్లు, అల్వాల్ సర్కిల్లో 223 కాలనీలలో 61,178 ఇండ్లలోని 72వేల నీటి కనెక్షన్లకు ఉచితంగా ఇంటికి ఇరవై వేల లీటర్ల చొప్పున నీటిని సరఫరాచేస్తున్నారు.
మీటర్ లేకుంటే బిల్లు చెల్లించాల్సిందే..
నీటి కనెక్షన్కు మీటర్ పెట్టకుంటే నెలనెల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 13నెలలుగా ఉచితంగా నీటిని సరఫరా చేస్తూ ఇండ్లలోని నల్లాలకు మీటర్లు పెట్టుకోవాలని ఇండ్ల యజమానులకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. అయితే 72వేల నీటి కనెక్షన్లకుగాను ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల నీటి కనెక్షన్లకు మీటర్లు పెట్టుకున్నారు. నీటి మీటర్ పెట్టుకున్న తర్వాత క్యాన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసి నెలనెల ఇరవై వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తారు. అంతకంటే ఎక్కువైతే వాడుకున్న నీటికి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
బస్తీలలో ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న బస్తీలలోని ఇండ్లలో నివస్తున్న కుటుంబాలు రూ.2లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఒక రూపాయికి నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజల దాహార్తిని తీర్చడానికి మల్కాజిగిరి సర్కిల్లో రూ.338.54కోట్లు, అల్వాల్ సర్కిల్లో రూ.190కోట్లతో ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇంటింటికి నెలకు ఇరవై వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఒక రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తున్నాం.