సుల్తాన్పూర్, నవంబర్ 16: ఉత్తరప్రదేశ్లోని లక్నో, గాజీపూర్ మధ్య కొత్తగా నిర్మించిన 341 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవంలో భాగంగా.. అత్యవసర సమయాల్లో ఎయిర్ఫోర్స్ విమానాలు దిగడానికి అనుగుణంగా నిర్మించిన ఎయిర్స్ట్రిప్పై మోదీ విమానం ల్యాండ్ అయింది. భారత సైన్యానికి చెందిన సీ-130జే హెర్క్యులస్ విమానంలో ఆయన అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు యూపీని పేదరికంలో నెట్టివేశాయని ఆరోపించారు.
ప్రస్తుతం యూపీలో బీజేపీ ప్రభుత్వం కొత్త చరిత్ర రాస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం అదే విమానంలో మోదీ తిరుగుపయనమయ్యారు. ఎక్స్ప్రెస్వేపై మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ షో నిర్వహించాయి. ఆరు లేన్ల ఈ ఎక్స్ప్రెస్వేను నిర్మించడానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది. ఇదిలా ఉండగా, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవాన్ని యూపీ సర్కారుతో పాటు సమాజ్వాదీ పార్టీ సమాంతరంగా నిర్వహించింది.
పలు చోట్ల పూల వర్షం కురిపించింది. ప్రాజెక్టును అఖిలేశ్ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభించారని సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో కాగ్ నిర్వహించిన తొలి ఆడిట్ దివస్ వేడుకల్లో కూడా ప్రధాని పాల్గొన్నారు. డాటా చాలా కీలకమైన వనరు అని.. ఇది భవిష్యత్లో చరిత్రను నిర్దేశిస్తుందన్నారు.