గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువే అయినా దేశంలో ఎడాపెడా ధరలు పెంచుతున్న కేంద్రం సమర్థించుకునేందుకు కేంద్రమంత్రుల వింత కారణాలు ఉచితంగా టీకా వేయట్లేదా అంటూ దబాయింపులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పెట్రోల్ రేట్లు మళ్లీ పెరిగాయి. సామాన్యుడి చమట కష్టాన్ని పెట్రోల్ రూపంలో పీల్చేస్తూ కేంద్రం సొమ్ము చేసుకొంటూనే ఉన్నది. పైగా రోజుకో అబద్ధం చెప్తూ తప్పించుకోజూస్తున్నది. కాంగ్రెస్ హయాంనాటి అప్పులను తీర్చడానికే పెట్రోల్ రేట్లు పెంచుతున్నామని కొన్ని రోజులు పాట పాడిన కేంద్రంలోని బీజేపీ నేతలు, తర్వాత అంతర్జాతీయ చమురు ధరల సాకును వెతుక్కొన్నారు. ఇప్పుడేమో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం లేదా.. దానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయనుకొన్నారంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దబాయిస్తున్నారు. టీకా ఉచితంగా ఇవ్వడం కోసమే పెట్రోల్ రేట్లు పెంచామని సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు.
2014లో కేంద్రంలో మోదీ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 102 డాలర్లు. దేశంలో పెట్రోల్ లీటర్ ధర 79 రూపాయలు. అదే ఇప్పుడు బ్యారెల్ ధర 84 డాలర్లు. లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు. ఈ రెండు పోలికల కన్నా 2019-20 మధ్యలో బ్యారెల్ చమురు ధర 20 డాలర్లకు పడిపోయినప్పుడు కూడా దేశంలో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయలు ఉంది. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రో రేట్లు తగ్గాలి. అయితే, తగ్గిన చమురు ధరల స్థానంలో సుంకాలను పెంచి.. సామాన్యులకు బదలాయించాల్సిన ఆ మొత్తాన్ని కేంద్రం తన ఖజానాకు మళ్లించుకొంటున్నది.
మే 1న హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 93.97. శుక్రవారం ధర రూ. 111.14. అంటే గడిచిన 6 నెలల్లో లీట రు పెట్రోల్పై రూ. 18 పెరిగింది. దీన్నిబట్టి ఓ సాధారణ పౌరు డు రోజుకు రెండు లీటర్ల పెట్రోల్ను బండిలో పోయిస్తే నెలకు రూ.1000కి పైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.
వరుసగా మూడో రోజూ లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.111.14కి చేరింది. అలాగే లీటరు డీజిల్ ధర 104.32కు పెరిగింది.
పెట్రోల్పై సుంకాల ద్వారా వచ్చిన డబ్బుతోనే ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు వేస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి శుక్రవారం చెప్పారు. ఇటీవల కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దేశంలో 95% మందికి పెట్రోల్ అవసరమే లేదని, పెరిగిన ఆదాయంతో పోలిస్తే పెట్రో ధరలు ఓ లెక్కా అంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారీ గురువారం విచిత్రమైన కామెంట్ చేశారు.
ఫ్రాన్స్లో ఇంధన ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు ఊరట కలిగించేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్ ఖర్చుల కోసం.. ప్రత్యేక ద్రవ్యోల్బణ భత్యం కిం 100 యూరోలు (రూ. 8,716) ఇస్తున్నట్టు ప్రధాని జీన్ కాస్టెక్స్ గురువారం రాత్రి ప్రకటించారు.