సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : లుంబినీ పార్కు.. ఎన్టీఆర్ గార్డెన్.. ట్యాంక్బండ్.. సంజీవయ్య పార్కు.. నెక్లెస్ రోడ్డు.. జల విహార్.. పీపుల్స్ ప్లాజా.. ఇలా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటున్నాయి. నగర వాసులకే కాకుండా దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు హుస్సేన్సాగర్ ప్రాంతాలకు విచ్చేస్తూ సాగర్ అందాలను ఆస్వాదిస్తుంటారు. అలాంటి హుస్సేన్సాగర్లోని జలాలు మురుగునీటితో కలుషితం కాకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. తాజాగా సాగర్ చుట్టూ 3 ప్రాంతాల్లో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల సామర్థ్యాన్ని పెంచింది. ప్రతి నీటి బొట్టును శుద్ధి చేసిన తర్వాతనే హుస్సేన్సాగర్లోకి వదలనున్నారు.
3 నాలాలపై ఏర్పాటుకు నిర్ణయం
బుల్కాపూర్ నాలా (ఖైరతాబాద్), కూకట్పల్లి-బేగంపేట నాలా (నెక్లెస్ రోడ్డు), పికెట్ నాలాల నుంచి మురుగునీరు హుస్సేన్సాగర్లోకి వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం మూడు నాలాలపై 2012-2014లో హుస్సేన్సాగర్ లేక్ ప్రాజెక్టు (హెచ్ఎస్ఎల్పీ)ను జైకా నిధులతో చేపట్టారు. ఖైరతాబాద్ వద్ద 20ఎంఎల్డీ, పాటిగడ్డ వద్ద 30ఎంఎల్డీ, కూకట్పల్లి-బేగంపేట నాలాపై మరో 5ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించగా, ప్రైవేటు సంస్థలు నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం లేకపోవడంతో అవి సాగర్లో కలిసిపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ, వాటి సామర్థ్యాన్ని పెంచి పైనుంచి వచ్చే మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించే పనులను చేపట్టేందుకు హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది.
శుద్ధి కేంద్రాల సామర్థ్యం పెంపు
ప్రస్తుతం 5ఎంఎల్డీ, 20ఎంఎల్డీ, 30ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న శుద్ధి కేంద్రాల సామర్థ్యాన్ని ఎంఎల్డీ 10, ఎంఎల్డీ 40, ఎంఎల్డీ 60 పెంచాలని నిర్ణయించారు. దీంతో సాగర్ జలాలు స్వచ్ఛంగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలకు మరింత శోభను తెచ్చేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు
3 చోట్ల అదనపు సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షించనున్నారు.